పరుగులు పెడుతున్న పసిడి ధర

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 12:12 PM

పరుగులు పెడుతున్న పసిడి ధర

వరుసగా ఐదో రోజు కూడా పసిడి ధర పైకి కదిలింది. దీంతో ధర రూ.42 వేలు దాటిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పసిడి పరిగెడుతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. జిగేల్‌మంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరగడం సహా దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రూపాయి క్షీణత సహా కరోనా వైరస్ కూడా పసిడి పరుగుకు కారణంగా నిలిచింది. కరోనా వైరస్ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాలున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపారు. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం పెరిగింది. రూ.130 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.42,100 నుంచి రూ.42,230 చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరుగుదలతో రూ.38,630 నుంచి రూ38,760 చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ఏకంగా రూ.400 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,200 నుంచి రూ.49,600కు పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఉండటం ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.38,760కు చేరింది. వెండి ధర కూడా రూ.49,600కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1579.95 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 18.07 డాలర్లకు ఎగసింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,600కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.140 పెరుగుదలతో రూ.40,800కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.400 పెరుగుదలతో రూ.49,600కు చేరింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర 2019లో ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements