కరోనా భూతం...106కు చేరిన మృతుల సంఖ్య

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 12:46 PM

కరోనా భూతం...106కు చేరిన మృతుల సంఖ్య

ప్రపంచాన్ని కరోనా వైరస్ ముప్పు భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య 106కు చేరింది. చైనాలోని వుహాన్‌లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండగా.. అది మిగతా నగరాలకూ పాకింది. చైనాలో కరోనా ఇన్ఫెక్షన్ బారిన 2700 మంది పడ్డారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది వుహాన్‌కు చెందిన వారే. కరోనా కారణంగా సోమవారం చైనా రాజధాని బీజింగ్‌లోనూ ఒకరు చనిపోయారని సమాచారం. బీజింగ్‌లో మరణించిన ఆ వ్యక్తికి 50 ఏళ్లు ఉంటాయని.. ఆయన జనవరి 8న వుహాన్ వెళ్లారని తెలుస్తోంది. కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న వుహాన్ నగరం, హుబేయ్ ప్రావిన్స్ నుంచి 250 మంది భారతీయులను తరలించే విషయమై భారత్, చైనా అధికారులు సోమవారం చర్చలు జరిపారు. గత 9 రోజులుగా చైనా నుంచి తిరిగి వచ్చిన 3756 మంది భారత ప్రయాణికులను ముంబై విమానాశ్రయంలో పరీక్షించారు. వీరిలో ఐదుగురిలో కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరం కనిపించాయి. ఇప్పటి వరకూ ముంబైలో కరోనా కేసులు నమోదు కాలేదు. కేరళ, మహారాష్ట్రల్లో వంద మందికిపైగా ప్రజలను అబ్జర్వేషన్లో ఉంచారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైనందున... వుహాన్ మేయర్ ఝౌ జియాన్‌వాంగ్ సహా ఇద్దరు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. కరోనా భయం కారణంగా వుహాన్‌తోపాటు 17 చైనా నగరాలను జనవరి 23 నుంచి మూసివేశారు. ప్రజా రవాణాతో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుందన్న భయాందోళనలే దీనికి కారణం. బీజింగ్‌లోనూ కరోనా వైరస్ కారణంగా ఒకరు మరణించడంతో.. దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే బస్సు సర్వీసులను ఆపేశారు. చైనాలో కరోనా వైరస్ ప్రమాదం అతి తీవ్రంగా ఉందని.. ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.





Untitled Document
Advertisements