33 మందిని సజీవ దహనం చేసిన దోషులకు బెయిల్...స్వరాష్ట్రంలోకి నో ఎంట్రీ

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 01:41 PM

33 మందిని సజీవ దహనం చేసిన దోషులకు బెయిల్...స్వరాష్ట్రంలోకి నో ఎంట్రీ

గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు 17 మంది దోషులకు బెయిల్ మంజూరు చేసింది. 2002 నాటి గోద్రా ఘటన అనంతర ఘర్షణల్లో 33 మందిని సజీవ దహనం చేసిన కేసులో దోషులైన వీరిని.. మధ్యప్రదేశ్ వెళ్లాలని సుప్రీం ఆదేశించింది. గుజరాత్‌లో అడుగు పెట్టొద్దని.. సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దోషులను రెండు గ్రూపులుగా విభజించిన ధర్మాసనం.. ఒక గ్రూపును గుజరాత్ విడిచి వెళ్లి, ఇండోర్‌లో నివసించాలని ఆదేశించింది. మరో గ్రూపును జబల్‌పూర్‌లో ఉండాలని తీర్పునిచ్చింది. సర్దార్‌పుర అల్లర్ల కేసులో గతంలో 17 మందిని దోషులుగా తేల్చిన గుజరాత్ హైకోర్టు.. వారికి యావజ్జీవ శిక్ష విధించింది. 14 మంది నిర్దోషులుగా తేల్చింది. దోషులంతా వారంలో ఆరు గంటలపాటు సామాజిక సేవ చేయాలని తాజాగా సుప్రీం తీర్పునిచ్చింది. వారానికోసారి స్థానిక పోలీసు స్టేషన్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దోషులు జీవనం సాగించడం కోసం వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇండోర్, జబల్‌పూర్‌ల జిల్లా న్యాయ సేవల అధికార యంత్రాంగాన్ని న్యాయస్థానం ఆదేశించింది. బెయిల్‌ను దోషులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించింది. నిబంధనలకు అనుగుణంగా వారు వ్యవహరిస్తున్నారా లేదా అనే విషయమై మూడు నెలల తర్వాత నివేదిక సమర్పించాలని ఆదేశించింది.





Untitled Document
Advertisements