'మా నాయకుల వల్లే ఓడిపోయాం'...ఢిల్లీలో ఓటమిపై అమిత్ షా కామెంట్స్!

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 07:54 PM

'మా నాయకుల వల్లే ఓడిపోయాం'...ఢిల్లీలో ఓటమిపై అమిత్ షా కామెంట్స్!

దిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. ‘కాల్చి పారేయండి’, ‘దేశ ద్రోహులను తరిమేయండి’ వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంలో వాడేందుకు బీజేపీ ఎప్పుడూ దూరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ, అలాంటి వ్యాఖ్యలు తమ పార్టీ నాయకులు ప్రచారంలో భాగంగా ప్రసంగించడం వల్లే తమకు ఎన్నికల్లో నష్టం చేకూరిందని అమిత్ షా అన్నారు. దిల్లీలో ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. గెలుపోటముల కోసం ఎన్నికల్లో ఎప్పుడూ తలపడలేదన్న అమిత్ షా.. పార్టీ భావజాల వ్యాప్తి కోసమే ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, దిల్లీ ఎన్నికల్లో సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్ ప్రభావం లేదని అభిప్రాయపడ్డారు. ఈ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించింది కాంగ్రెస్ పార్టీనే అని అమిత్ షా విమర్శించారు. సీఏఏ సంబంధిత అంశాలపై తనతో ఎవరైనా మాట్లాడవచ్చని, ఇందుకోసం తన కార్యాలయానికి రావాలని అమిత్ షా చెప్పారు. వారికి మూడు రోజుల్లో సమయం కేటాయిస్తానని వెల్లడించారు. అయితే, శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. ఫిబ్రవరి 8న దిల్లీలోని రిఠాలాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీడియా మొత్తం అక్కడే ఉండగా ఆయన తన రెండు చేతులను పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ‘దేశ ద్రోహులను కాల్చి చంపేయాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు జనం కేకలు వేస్తుండగా మంత్రి ఆ ఊపులో ‘వారిని తుపాకీతో కాల్చిపారేయాలి’ (గోలీ మారో) అంటూ రెచ్చగొట్టేలా ప్రసంగించారు. అంతేకాక, ఓ బీజేపీ అభ్యర్థి చేసిన ట్వీట్ కూడా వివాదాస్పదం అయింది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఓ ఘాటైన ట్వీట్ చేశారు. దీంతో ఎన్నికల సంఘం సూచన మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దిల్లీ ఎన్నికల్లో ఆప్ 62 సీట్ల భారీ మెజారిటీ సాధించి అధికారాన్ని నిలుపుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements