RCB కొత్త లొగో!

     Written by : smtv Desk | Fri, Feb 14, 2020, 02:04 PM

RCB కొత్త లొగో!

ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంఛైజీ తమ టీమ్ లొగోని మార్చింది. కొత్త దశాబ్దం.. కొత్త లొగోతో ఐపీఎల్‌లో బరిలోకి దిగబోతున్నట్లు ఈరోజు ప్రకటించిన ఆర్సీబీ యాజమాన్యం.. ఈ మేరకు టీమ్ సోషల్ మీడియా అకౌంట్స్‌లోనూ ప్రొఫైల్ ఫొటోల్ని మార్చింది. ఇటీవల టీమ్ ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్స్‌ నుంచి ఫొటోల్ని తొలగించడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, చాహల్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. కానీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కనీసం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. 2016లో ఫైనల్‌కి చేరిన ఆర్సీబీ.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరుస్తోంది. 2019 సీజన్‌లో వరుస పరాజయాల్ని చవిచూసిన ఆ జట్టు.. కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. దీంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌లోనైనా సత్తాచాటాలని ఆర్సీబీ ఆశిస్తోంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు గత ఏడాది తమ టీమ్ పేరుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా మార్చుకుని.. సరికొత్త లొగోతో బరిలోకి దిగింది. దీంతో.. గత ఐదారు సీజన్లుగా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాల్లో కనిపించిన ఆ జట్టు.. 2019 ఐపీఎల్ సీజన్‌లో మాత్రం కొన్ని రోజులు టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆఖర్లో ఆ జట్టు వరుసగా విజయాలు సాధించిన తీరు చూస్తే..? టైటిల్ కూడా గెలుస్తుందేమో..? అనిపించింది. కానీ.. ప్లేఆఫ్‌లో చెన్నై చేతిలో ఓడిన ఢిల్లీ టీమ్.. టైటిల్‌కి అడుగు దూరంలో నిలిచిపోయింది. అయితే.. బెస్ట్ ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ బాటలోనే పయనించబోతున్నట్లు తాజాగా లొగోని మార్చడం ద్వారా అర్థమవుతోంది. ఐపీఎల్ 2020 సీజన్‌కి జట్టులోనూ అనూహ్య మార్పులు చేసిన ఆర్సీబీ.. వేలంలో అరోన్ ఫించ్, క్రిస్‌ మోరీస్, కేన్ రిచర్డ్‌సన్, డేల్ స్టెయిన్ తదితరుల్ని కొనుగోలు చేసి బలంగా కనిపిస్తోంది.





Untitled Document
Advertisements