IPL 2020: భారత స్పిన్నర్‌పై అనర్హత వేటు.. KKR కు భారీ షాక్

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 03:03 PM

IPL 2020: భారత స్పిన్నర్‌పై అనర్హత వేటు.. KKR కు భారీ షాక్

ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన సీనియర్ స్పిన్నర్ ప్రవీణ్ తంబే‌ని ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడించొద్దంటూ కోల్‌కతా ఫ్రాంఛైజీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది చివర్లో యూఏఈ వేదికగా జరిగిన టీ10 ప్రైవేట్ లీగ్‌లో తంబే ఆడినందున.. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్‌లో అతను ఆడేందుకు అనర్హుడయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి రూ.20 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన ప్రవీణ్ తంబేని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ అదే ధరకి కొనుగోలు చేసింది. దీంతో.. వేలంలో అమ్ముడుపోయిన అతి పెద్ద వయస్కుడిగా 48ఏళ్ల ప్రవీణ్ తంబే వార్తల్లో నిలిచాడు. కానీ.. గత ఏడాది టీ10 లీగ్‌లో ఆడేందుకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సీనియర్ స్పిన్నర్.. మళ్లీ ముంబయి టీ20 లీగ్‌లో ఆడేందుకు ఆ వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయినప్పటికీ.. బీసీసీఐ నిబంధనల్ని అతను ఉల్లఘించినట్లే అవుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ చెప్పుకొచ్చారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ భారత క్రికెటర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించకుండా విదేశీ ప్రైవేట్ టోర్నీల్లో ఆడకూడదు. దీంతో.. టీ10 లీగ్‌లో ఆడేందుకు యువరాజ్ సింగ్, ప్రవీణ్ తంబే తదితర భారత సీనియర్ క్రికెటర్లు గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ.. ఆ టోర్నీ తర్వాత రిటైర్మెంట్‌ని అనూహ్యంగా తంబే వెనక్కి తీసుకున్నాడు. అయితే.. బీసీసీఐ మాత్రం అతడిని ఐపీఎల్‌లో ఆడించేది లేదని తేల్చి చెప్పేసింది. ఒకవేళ తంబేని ఇప్పుడు ఆడిస్తే..? మిగిలిన క్రికెటర్లని కూడా ఆడించాల్సి వస్తుందని బీసీసీఐ వెల్లడించింది.





Untitled Document
Advertisements