పెంచడం కష్టమట...అందుకే పిల్లల్ని కనడం లేదు!!!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 04:16 PM

పెంచడం కష్టమట...అందుకే పిల్లల్ని కనడం లేదు!!!

ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. స్త్రీ జీవితంలోనే అదొక అపురూపమైన ఘట్టం . అమ్మను కాబోతున్నానని తెలిసిన క్షణం నుంచి పిల్లలు పుట్టి, పెరిగి పెద్దయ్యే వరకూ… వారితో గడిపే ప్రతిక్షణం అమ్మ ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. కానీ సౌత్ కొరియా మహిళలు మాత్రం అంతటి అపురూపమైన అమ్మతనాన్ని వదులుకుంటున్నారు. తమకు పిల్లలు వద్దనుకుంటున్నారు. వారు దీనికి కొన్ని కారణాలు చెబుతున్నారు. పిల్లలను పెంచడం భారమని చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు వారు చదువుకోవడం, ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఇబ్బందులు వస్తాయని, ఇంకోవైపు అక్కడి సంప్రదాయ, సాంఘిక విలువల నేపథ్యంలోనూ వారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలతో సౌత్ కొరియాలో బర్త్ రేట్ దారుణంగా పడిపోతోంది. ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి చేరింది. 2019లో 3,03,100 మంది పిల్లలు మాత్రమే పుట్టారని ఆ దేశం ప్రకటించింది. 2018తో పోలిస్తే బర్త్ రేట్ 7.3 శాతం తగ్గిందని తెలిపింది. కంట్రీ బర్త్ రేట్ స్టేబుల్‌గా ఉండాలంటే ఒక్కో మహిళ ఇద్దరు పిల్లలను కనాలి. కానీ అక్కడ ఒక్కో మహిళ ఒక్కర్నే కంటోంది. వరుసగా రెండేండ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. బర్త్ రేట్‌ను పెంచేందుకు సౌత్ కొరియా 2006 నుంచి చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.1,060 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. జనాభా పెరగాల్సింది పోయి తగ్గుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రస్తుతం 5.1 కోట్లున్న జనాభా… 2067 వరకు 3.9 కోట్లకు తగ్గుతుందని చెప్తున్నారు. మరోవైపు అప్పటికి మధ్యస్థ వయసు 62 ఏండ్లు ఉంటుందంటున్నారు. ప్రపంచంలోనే అధిక ఆయుర్దాయం ఉన్న దేశాల్లో సౌత్ కొరియా ఒకటి. ఇప్పుడక్కడ బర్త్ రేట్ తగ్గుతుండడంతో ఫ్యూచర్‌లో వృద్ధుల సంఖ్య ఎక్కువైతదని సౌత్ కొరియా ఆందోళన చెందుతోంది.





Untitled Document
Advertisements