CBIకి గీత అత్యాచారం, హత్యకేసును అప్పగించిన జగన్ సర్కార్!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 08:13 PM

CBIకి గీత అత్యాచారం, హత్యకేసును అప్పగించిన జగన్ సర్కార్!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కర్నూలు బాలిక గీత కేసుకు సంబంధించి జగన్ సర్కార్ ముందడుగు వేసింది.‌ ఈ కేసును సీబీఐకి అప్పగించింది.. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. త్వరలోనే సీబీఐ రంగంలోకి దిగనుంది. ముఖ్యమంత్రి జగన్ కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంలో బాలిక కుటుంబ సభ్యులు కలిసి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నామని.. తప్పకుండా న్యాయం జరుగుతుందని జగన్ భరోసా ఇచ్చారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామని.. వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. బాలిక కుటుంబం మరోసారి తనను కలవాలని.. అప్పుడు అన్ని విషయాలపై చర్చిస్తానన్నారు. వారిని తన దగ్గరకు తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇవ్వడంతో.. బాలిక కుటుంబం కూడా తమకు న్యాయం జరుగుతుందన్నారు. సీబీఐకు కేసును అప్పగించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలుకు చెందిన బాలిక 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చదువుతున్న స్కూల్‌లోనే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు యాజమాన్యం చెప్పింది. కానీ ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్ట్‌మార్టంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలగా.. కుటుంబసభ్యులు స్కూల్ యజమానితో పాటు అతడి కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ కేసు విచారణ ముందుకు సాగలేదు.. అప్పటి నుంచి తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ బాలిక కుటుంబసభ్యులు పోరాటం చేస్తోంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కర్నూల్‌లో మార్చ్ నిర్వహించారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ స్పందించకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఈ కేసు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పవన్ ర్యాలీ చేసిన వారం తర్వాత సీఎం జగన్ ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు.





Untitled Document
Advertisements