ఐదు రోజుల టెస్టుని నాలుగు రోజులకి...కుంబ్లే సప్పోర్ట్

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 07:39 PM

ఐదు రోజుల టెస్టుని నాలుగు రోజులకి...కుంబ్లే సప్పోర్ట్

టెస్టు మ్యాచ్‌ని నాలుగు రోజులకి కుదించాలనే ఐసీసీ ప్రతిపాదనని భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తిరస్కరించాడు. టెస్టులకి ఆదరణ తగ్గిపోతుండటంతో.. మళ్లీ అభిమానుల్ని ఆకర్షించేందుకు నాలుగు రోజుల టెస్టుల ప్రతిపాదనని ఐసీసీ తెరపైకి తీసుకొచ్చింది. కానీ.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కపిల్‌దేవ్, సౌరవ్ గంగూలీ ఈ ప్రతిపాదనని తిరస్కరించారు. భారత క్రికెటర్లే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లు కూడా ఐదు రోజుల టెస్టులకే ఓటేశారు. నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనపై తాజాగా అనిల్ కుంబ్లే స్పందించాడు. ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ హోదాలో ఉన్న కుంబ్లే మాట్లాడుతూ ‘చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు నాలుగు రోజుల టెస్టుని వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజుల కారణంగానే దాన్ని టెస్టు అని పిలుస్తున్నారు. ఒకవేళ నాలుగు రోజులే నిర్వహిస్తే..? దాన్ని టెస్టు అని పిలవలేం. ఆదరణ పెంచడానికి, అభిమానుల్ని స్టేడియాలకి రప్పించడానికి నాలుగు రోజులకి కుదించబోతున్నట్లు ఐసీసీ చెప్తోంది. కానీ.. చాలా మంది ఇంట్లో కూర్చుని.. టెస్టు మ్యాచ్‌లను ఫాలో అవుతున్నారు. అలానే ఫోన్ల ద్వారా.. మెసేజ్‌లు, నోటిఫికేషన్ రూపంలో మ్యాచ్‌ స్కోర్లు, సమాచారం తెలుసుకుంటున్నారు. అభిమానులు టెస్టుల గురించి ఇంతలా చర్చిస్తూ, మాట్లాడుకుంటున్నప్పుడు టెస్టు క్రికెట్‌ ఎలా కనుమరుగవుతుంది’ అని అనిల్ కుంబ్లే ప్రశ్నించాడు. వాస్తవానికి టీ20ల జోరుతో టెస్టులకి ఆదరణ క్రమంగా తగ్గిపోతోంది. కానీ.. మళ్లీ ఈ ఐదురోజుల ఫార్మాట్‌కి ఆదరణ పెంచేందుకు నాలుగు రోజులకి కుదించడం సరైన పరిష్కారం కాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. డే/నైట్ టెస్టుల తరహాలో అభిమానులకి కొత్త అనుభూతిని పరిచయం చేస్తూ వారి ఆదరణ చూరగొనేందుకు ప్రయత్నించాలి తప్ప.. దశాబ్దాల సంప్రదాయ క్రికెట్‌ని నాశనం చేయొద్దంటూ మరికొందరు సూచిస్తున్నారు.





Untitled Document
Advertisements