‘కార్తికేయ 2’ ముహూర్తం ఫిక్స్

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 07:41 PM

‘కార్తికేయ 2’ ముహూర్తం ఫిక్స్

నిఖిల్ హీరోగా సుమారు ఆరేళ్ల క్రితం అంటే 2014 అక్టోబర్ 24న ‘కార్తికేయ’ అనే సినిమా విడుదలైంది. నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ‘కార్తికేయ’ను మించిన సినిమాను నిఖిల్ చేయలేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు అని నిఖిల్‌ను అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇటు నిఖిల్‌తో పాటు డైరెక్టర్ చందు మొండేటిని సీక్వెల్ గురించి పదేపదే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. యానిమ‌ల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ‘కార్తికేయ’ చిత్రం ద్వారా డైరెక్టర్ చందు మొండేటి తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌యం చేశారు. మొత్తానికి మళ్లీ వీరిద్దరి కాంబినేష‌న్‌లో ‘కార్తికేయ 2’ వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 2న తిరుమ‌ల తిరుప‌తిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీవేంక‌టేశ్వరుని స‌న్నిధానంలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ‘‘అర్జున్ సుర‌వ‌రం’’ లాంటి బ్లాక్‌బ‌స్టర్ త‌రువాత ఏ చిత్రం చేయ‌కుండా కొంత గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల‌కి, త‌న అభిమానుల‌కి కిక్ ఇచ్చే చిత్రం చేయాల‌ని నిఖిల్ ‘కార్తికేయ‌ 2’కి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఊహకు అందని మరో కొత్త కథలో చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ‘కార్తికేయ 2’కు సంబంధించి ఒక్కో సర్‌ప్రైజ్‌ను రివీల్ చేస్తూ 2020 చివరిలో సినిమాను విడుదల చేస్తారట. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం గురించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు.





Untitled Document
Advertisements