కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో ఆదివారం ఉదయం నాటికి కరోనా కేసుల సంఖ్య 324కు చేరింది. ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి గురించి భయపడుతున్నారు. ఇంతకీ మన ఇన్సూరెన్స్ పాలసీలు, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కరోనా చికిత్సకు కవరేజీకి ఇస్తాయా లేదా అన్నది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న విషయం. దీంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) ఈ విషయమై గతవారం సర్కులర్ ఇచ్చింది. తమ ఇన్సూరెన్స్ పాలసీల్లో కరోనాకూ కవరేజీ ఇచ్చే ఇన్సూరర్స్ ఇలాంటి బీమా క్లెయిములను త్వరగా పరిష్కరించాలని ఆదేశించింది. కరోనా క్లెయిమ్స్ను తిరస్కరించడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనాను మహమ్మారిగా ప్రకటించడంతో జనంలో ఆందోళన ఇంకా ఎక్కువయింది. కరోనా విషయంలో పాలసీహోల్డర్లకు వీలైనంత సాయం చేస్తామని ఎస్బీఐ జనరల్, ఎడల్వీస్ జనరల్, సిగ్నా మణిపాల్, బజాజ్ అలియాంజ్ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రకటించాయి. కరోనా ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తామని, క్వారంటైన్ ట్రీట్మెంట్ ఖర్చులనూ క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపాయి. అయితే కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యాండెమిక్గా (ప్రపంచవ్యాప్త వ్యాధి) ప్రకటించడంతో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు దీనికి కవరేజ్ ఇస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి మెజారిటీ కంపెనీలు కరోనా ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తామని చెబుతున్నా, కేసులు పెరిగి, పరిస్థితి విషమిస్తే మాత్రం వెనకడుగు వేసే అవకాశాలు ఉంటాయి. కేసులు పెరిగే కొద్ది ట్రీట్మెంట్, టెస్టుల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎక్కువ మంది క్లెయిమ్ చేసుకుంటే కంపెనీలకు నష్టాలు పెరుగుతాయి. అయితే కొత్తగా ఏర్పడ్డ డిజిట్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు మాత్రం కరోనాకు పాలసీలు ఇస్తున్నాయి. డిజిట్ అనే ఆన్లైన్ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్ తొలిసారిగా ‘హెల్త్ కేర్ ప్లస్ పాలసీ’ పేరుతో కరోనా ఇన్సూరెన్స్ ప్లాన్ను తీసుకొచ్చింది. 75 ఏళ్లలోపు వయసున్న వారు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ప్రీమియాన్ని బట్టి బీమా కవరేజీ రూ.25 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. రూ.రెండు లక్షల కవరేజీ కావాలనుకుంటే రూ.2,392+జీఎస్టీ కట్టాలి. ట్రీట్మెంట్కు పూర్తి ఖర్చులు చెల్లిస్తారు. క్వారంటైన్ చికిత్సకు మాత్రం సగం భరిస్తారు. అయితే బాధితుడు కనీసం 14 రోజుల్లో క్వారంటైన్లో ఉండి, ప్రభుత్వ లేదా మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి. ఈ పాలసీలో ఒకటి కంటే ఎక్కువ మంది పేర్లను చేర్చవచ్చు. వారి సంఖ్యను బట్టి బీమా ప్రీమియం పెరుగుతుంది. ఇంతకుముందు ఉన్న వ్యాధులకు ఈ పాలసీ వర్తించదు. పాలసీ కొన్నాక 15 రోజుల తరువాత వచ్చే వ్యాధులకే బీమా ఉంటుంది. గత నాలుగు వారాల నుంచి తీవ్రమైన దగ్గు, శ్వాస సమస్యలు ఉన్న వారు పాలసీ కొనడానికి అర్హులు కారు. పాలసీ వ్యాలిడిటీ ఏడాది ఉంటుంది. దీనిని పొడగించుకోవడం కుదరదు.