కరోనా వైరస్ కట్టడికి...రోజర్ ఫెదరర్ రూ. 7.75 కోట్లు విరాళం

     Written by : smtv Desk | Thu, Mar 26, 2020, 11:47 AM

కరోనా వైరస్ కట్టడికి...రోజర్ ఫెదరర్ రూ. 7.75 కోట్లు విరాళం

కరోనా వైరస్ కట్టడి కోసం స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ముందుకు వచ్చాడు. గత వారం నుంచి స్విట్జర్లాండ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోగా.. బుధవారం రాత్రికి ఆ దేశంలో మరణాల సంఖ్య 86కి చేరుకుంది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు క్రీడాకారులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో రోజర్ ఫెదరర్ ఏకంగా రూ. 7.75 కోట్లు విరాళంగా ప్రకటించాడు. ‘కరోనా వైరస్‌ ఇప్పుడు అందరికీ సవాల్‌‌గా మారిపోయింది. ఎవరూ తప్పించుకోవడానికి లేదు. నా భార్య మిర్కా, నేను వ్యక్తిగతంగా ఒక రూ. 7.75 కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’’ అని రోజర్ ఫెదరర్ ప్రకటించాడు. కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన టాప్-10 దేశాలలో స్విట్జర్లాండ్ కూడా ఉంది. బుధవారం రాత్రికి ఆ దేశంలో ఏకంగా 8,800 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి సామాజిక దూరం ఏకైక మార్గమని భావిస్తున్న ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. చైనాలోని వుహాన్ ఈ లాక్‌డౌన్ ద్వారా ఆ వైరస్‌ని కట్టడి చేసి ఉండటంతో.. ఇప్పుడు అదే బాటలో బ్రిటన్, భారత్, బంగ్లాదేశ్ తదితర దేశాలు కూడా అడుగులు వేశాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించగా.. మొత్తం మూడు వారాల పాటు ప్రజలు ఇంట్లోనే ఉండాలని నరేంద్ర మోడీ సూచించిన విషయం తెలిసిందే. అలానే బంగ్లాదేశ్‌లోనూ గురువారం నుంచి 10 రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు.





Untitled Document
Advertisements