తెలుగు రాష్ట్రాలకు స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆర్ధిక సాయం

     Written by : smtv Desk | Thu, Mar 26, 2020, 06:04 PM

తెలుగు రాష్ట్రాలకు స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆర్ధిక సాయం

క‌రోనా వైర‌స్‌ ప్రపంచవ్యాప్తంగా విస్త‌రిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా ఈ వైర‌స్ బారిన‌ పడ్డారు. దాదాపు 21 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఇక మన దేశ విషయానికొస్తే ఇండియావ్యాప్తంగా 600 మందికిపైగా క‌రోనా పాజిటివ్‌గా తేలారు. ఇప్పటివరకు 13 మంది తన ప్రాణాలను కోల్పోయారు. అయితే క‌రోనాపై పోరాటానికి ప్రభుత్వానికి ఈ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు షట్లర్ పి.వి.సింధు తెలుగు ప్రభుత్వాలకు 5 లక్షల రూపాయ‌ల‌ చొప్పున సాయం ప్ర‌క‌టించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్‌కు ఈ నిధులను విరాళంగా ఇస్తున్నట్లు సింధు ట్వీట్ చేసింది. క‌రోనాపై పోరాటానికి ఈ నిధుల‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. మరోవైపు బిసిసిఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ 50 లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని పేదలను పంచేందుకు ముందుకొచ్చిన‌ సంగతి తెలిసిందే. అలాగే సినీ హీరో నితిన్ కూడా 10 లక్షల రూపాయల చొప్పున తెలుగు ప్రభుత్వాలకు సాయం ప్రకటించిన సంగతి విదితమే. మరోవైపు 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సింధు.. బ్యాడ్మింటన్ మ‌హిళ‌ల సింగిల్స్‌ విభాగంలో రజత పతకం సాధించింది. ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ కోసం తాను సన్నద్ధమైంది. అయితే కరోనా వైరస్ కారణంగా వచ్చే ఏడాదికి ఈ టోర్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచ క్రీడారంగంలోని అన్ని టోర్నీలు ఈ వైరస్ ప్రభావానికి గురి అయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు క్రికెటర్లు, క్రీడాకారులు ఇంటివద్దే గ‌డుపుతున్నారు.





Untitled Document
Advertisements