పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి మోదీ గుడ్ న్యూస్...2 కీలక నిర్ణయాలు!

     Written by : smtv Desk | Thu, Mar 26, 2020, 06:19 PM

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి మోదీ గుడ్ న్యూస్...2 కీలక నిర్ణయాలు!

కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త అందించింది. పీఎఫ్ విత్‌డ్రా రూల్స్‌ను సవరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపణ ప్యాకేజీలో భాగంగానే ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. కరోనా వైరస్ నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కిండానికి ఈమె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లు వారి పీఎఫ్ అకౌంట్ నుంచి ఇప్పుడు ఏకంగా 75 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే మూడు మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని అయినా వెనక్కి తీసుకోవచ్చు. మీ పీఎఫ్ ఖాతాలోని అకౌంట్‌లో ఉన్న మొత్తంపై ఇది ఆధారపడి ఉంటుంది.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త కూడా అందించింది. వచ్చే మూడు నెలల కాలం పాటు పీఎఫ్ అకౌంట్ డబ్బులను కేంద్రమే భరించనుంది. అంటే ఉద్యోగి కంట్రిబ్యూషన్ మొత్తాన్ని, కంపెనీ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని అంటే మొత్తంగా 24 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే మీ పీఎఫ్ అకౌంట్‌లో జమచేయనుంది. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. 100 మంది వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుంది. అలాగే వీరిలో 90 శాతం మంది వేతనం రూ.15,000లోపు ఉండాలి.

ఇంకా నిర్మలా సీతారామన్ పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే డబ్బుల అంశం గురించి ప్రస్తావించారు. రైతులకు పీఎం కిసాన్ కింద రూ.2,000ను వచ్చే వారంలో విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో వచ్చే వారంలో అన్నదాతల అకౌంట్లకు రూ.2,000 జమ కానున్నాయి. లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఈ చర్య ఎంతో ప్రయోజనకరమని భావించొచ్చు.

అంతేకాకుండా నిర్మలమ్మ గరీబ్ క్యలాణ్ యోజన స్కీమ్‌ను ఆవిష్కరించారు. దీని కోసం రూ.1.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎవ్వరూ కూడా ఆకలి బాధలు పడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. వలస కూలీలు, పేదలకు ఈ డబ్బు ద్వారా నేరుగా అకౌంట్లలోకి వెళ్లొచ్చు.

మోదీ సర్కార్ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 18 వేల మందికి పైగా మరణించారు. ఇంకా 4 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. మన దేశంలో ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 600కు పైకి చేరింది.





Untitled Document
Advertisements