ఆర్‌బీఐ గుడ్ న్యూస్: మూడు నెలలు ఈఎంఐలు బంద్

     Written by : smtv Desk | Fri, Mar 27, 2020, 03:54 PM

ఆర్‌బీఐ గుడ్ న్యూస్: మూడు నెలలు ఈఎంఐలు బంద్

కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కిడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఇప్పుడు ఆర్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. కీలక రెపో రేటును భారీగా తగ్గించింది. అంతేకాకుండా బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయం కూడా తీసుకుంది. ఆర్‌బీఐ తాజాగా లోన్ ఈఎంఐలపై 3 నెలలు మారటోరియం విధించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లు మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా చాలా ప్రయోజనం కలిగించే చర్య అని చెప్పకోవచ్చు. అన్ని రకాల ఔట్‌స్టాండింగ్ లోన్స్‌కు ఇది వర్తిస్తుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి వాటికి ఇది వర్తిస్తుంది. అలాగే ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి ఆర్‌బీఐ తాజాగా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. ఇకపోతే ఆర్‌బీఐ చివరిగా గతేడాది అక్టోబర్ నెలలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు 5.15 శాతానికి దిగొచ్చింది. సాధారణంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమీక్ష మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ మీటింగ్‌ను ముందుగానే నిర్వహించారు. ఆర్‌బీఐ రెపో రేటుతో పాటు రివర్స్ రెపో రేటును కూడా తగ్గించింది. ఏకంగా 90 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో రివర్స్ రెపో రేటు 4 శాతానికి తగ్గింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడం లక్ష్యంగా రిజర్వు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భవిష్యత్ అంచనాలపై అనిశ్చితి నెలకొందని, భారత్ రానున్న రోజుల్లో కోవిడ్ 19ని ఎలా ఎదుర్కుంటుందనే అంశంపైనే భవిష్యత్ వృద్ధి అంచనాలు సహా ఇతరత్రా అంశాలు ఆధారపడి ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరించారు.





Untitled Document
Advertisements