త‌మిళ యువ న‌టుడు కన్నుమూత ...

     Written by : smtv Desk | Sat, Mar 28, 2020, 10:50 AM

త‌మిళ యువ న‌టుడు కన్నుమూత ...

త‌మిళ యువ న‌టుడు, డాక్టర్ సేతురామ‌న్ క‌న్నుమూశారు. ఆయన వయస్సు 37 ఏళ్లు. గురువారం గుండెపోటు రావ‌డంతో రాత్రి 8 గంట‌ల 45 నిమిషాల‌కు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సేతురామ‌న్ న‌టుడే కాక వృత్తిరిత్యా స్కిన్ డాక్టర్. చెన్నైలో స్కిన్ కేర్ క్లినిక్‌ ఏర్పాటు చేసి వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. సేతురామ‌న్‌ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవలే సేతురామన్‌కు ఉమయాల్‌తో వివాహం అయ్యింది. ఆయనకు ఏడాది వయసున్న కూతురు ఉంది. చిన్న వయసులోనే సేతురామ‌న్‌ గుండె పోటుతో మరణించడం పట్ల షాక్‌లో ఉంది తమిళ ఇండస్ట్రీ. అనేక మంది నటులు, దర్శకులు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. సేతురామ‌న్ త‌మిళ హాస్య‌ న‌టుడు సంతానానికి అత్యంత స‌న్నిహితుడు. ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించిన సేతురామన్.. రజినీకాంత్, శింబు చిత్రాల్లో నటించారు. ఆయన హఠాన్మరణం పట్ల తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విశాల్, ఖుష్బు, అర్చన, శిబిరాజ్, విష్ణు దర్శక నిర్మాత వెంకట్ ప్రభు, ధనంజయన్ తదితరులు సేతురామ‌న్ ఆత్మ‌కి శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. మంచి మిత్రుడ్ని కోల్పోయాం అంటూ ఆవేదన చెందుతున్నారు. సేతురామన్ 2013లో ‘కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య’ చిత్రం ద్వారా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. డైరెక్ట‌ర్‌ మణికందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతానం, సేతు, పవర్‌స్టార్ శ్రీనివాసన్, విశాఖా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత‌రం ‘వాలిబా రాజా’, ‘సక్కా పోడు పోడు రాజా అండ్‌ 50/50’ చిత్రాలతో గుర్తింపు పొందారు. ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత పలువురు సెలబ్రిటీలకు కూడా ఆయనే స్వయంగా వైద్యం అందించి డాక్టర్ గానూ పేరు సంపాదించారు. నిన్న మొన్నటివరకూ ఆరోగ్యంగానే ఉన్న సేతురామన్.. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అందరితో చాలా సరదాగా ఉంటూ హఠాత్తుగా సేతురామన్ ఈలోకాన్ని విడవడం బాధాకరం అంటూ తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.





Untitled Document
Advertisements