కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలకి అండగా నిలబడుతూ టాలీవుడ్ హీరోలు ఆర్ధిక సాయాలు చేస్తున్నారు. కాగా విరాళాలు అందించడంపై జనసేన అధినేత ‘పవన్ కళ్యాణ్’ హీరోలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే.. ప్రభాస్ రూ.4 కోట్ల విరాళం అందించగా, పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్లు, చిరంజీవి రూ.1 కోటీ, అల్లు అర్జున్ రూ. 1.25 కోట్లు,రామ్ చరణ్, ఎన్టీఆర్ రూ. 75 లక్షల విరాళం అందించారు. కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి సినిమానే నమ్ముకొని జీవిస్తున్న ఎందరో కార్మికులు, టెక్నీషియన్లు ఆర్ధికంగా అల్లాడిపోతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి పెద్దన్నగా ముందుకు వచ్చిన శ్రీ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. సమాజ క్షేమం గురించి ఆలోచించే మహేష్ బాబు కోటీ రూపాయలు ఇచ్చి సమాజం పట్ల తనకున్న ఆపేక్షను వ్యక్తం చేశారు.నా అన్న బిడ్డ రామ్ చరణ్.. తండ్రి అడుగుజాడలలో పయనిస్తూ తనకంటూ సేవాభావాన్ని పెంపొందించుకుంటూ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు.అని పవన్ అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.