బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కేవలం రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని ఇప్పటికే నిరూపించుకున్నారు. తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఆయన ఆర్మీకి డొనేట్ చేస్తూ ఉంటారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంచి అమర జవానుల కుటుంబాలకు అక్షయ్ కుమార్ ఆర్థిక సాయం అందించారు. అయితే, రియల్ హీరో అనే ప్రశంసకు తాను పూర్తి అర్హుడనని మరోసారి నిరూపించారు అక్షయ్. కరోనా వైరస్పై పోరాటం కోసం తన వంతు సాయంగా రూ.25 కోట్ల భారీ విరాళాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించారు.
కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. దానిపై పోరాడటానికి, దాని నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలకు నిధులు చాలా అవసరం. అందుకే, ఈ నిధులను సేకరించడంలో దేశ ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఎవరికి తోచినంత చిన్న మొత్తమైనా విరాళంగా ఇవ్వొచ్చని ప్రధాని పేర్కొన్నారు. మీరిచ్చే ఒక్కో రూపాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ను పటిష్టం చేయడానికి, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ మేరకు పీఎం-కేర్స్ ఫండ్ను శనివారం ప్రారంభించారు. విరాళాలు పంపాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలను ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్కు అక్షయ్ కుమార్ రిప్లై ఇచ్చారు. తాను దాచుకున్న మొత్తం నుంచి రూ.25 కోట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం-కేర్స్ ఫండ్కు విరాళంగా ఇస్తున్నానని ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు విరాళంగా ఇవ్వడంపై ఆయన అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అక్షయ్ కుమార్ రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.
This is that time when all that matters is the lives of our people. And we need to do anything and everything it takes. I pledge to contribute Rs 25 crores from my savings to @narendramodi ji’s PM-CARES Fund. Let’s save lives, Jaan hai toh jahaan hai. https://t.co/dKbxiLXFLS
mdash; Akshay Kumar (@akshaykumar) March 28, 2020