లైఫ్ ఫస్ట్.. ఆ తర్వాతే ఒలింపిక్స్: పీవీ సింధు

     Written by : smtv Desk | Sat, Mar 28, 2020, 07:52 PM

లైఫ్ ఫస్ట్.. ఆ తర్వాతే ఒలింపిక్స్: పీవీ సింధు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేయడాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు స్వాగతించింది. ప్రపంచ వ్యాప్తంగా శనివారం సాయంత్రానికి సుమారు 6 లక్షల మందికి ఈ వైరస్ సోకగా.. భారత్‌లో ఈ సంఖ్య ఇప్పటికే 900కి చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ఒలింపిక్స్ వాయిదా వేయడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) ముందు లేకపోయింది. జపాన్‌లోని టోక్యో వేదికగా ఈ ఏడాది జులై 24 నుంచి ఒలింపిక్స్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ మెగా టోర్నీకి తమ అథ్లెట్స్‌ని పంపబోమని కొన్ని దేశాలు స్పష్టం చేశాయి. మరోవైపు అథ్లెట్స్ కూడా తమ ఆరోగ్యంతో ఐఓసీ ఆటలు ఆడటం సమంజసం కాదని హితవు పలికారు. దీంతో.. వచ్చే ఏడాదికి ఒలింపిక్స్‌ని వాయిదా వేస్తూ ఇటీవల ఐఓసీ నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్ వాయిదాపై పీవీ సింధు మాట్లాడుతూ ‘‘ఒలింపిక్స్ వాయిదా తప్పు నిర్ణయమేమి కాదు. ఎందుకంటే..? కరోనా వైరస్ నేపథ్యంలో.. ఐఓసీకి మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. వారాలు, రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఒలింపిక్స్‌లో ఆడటం నీ కల.. మరి ఇప్పుడు వాయిదా పడ్డాయి కదా..? అని అందరూ బాధపడుతూ చెప్తున్నారు. కానీ.. లైఫ్ ఫస్ట్.. ఆ తర్వాతే ఒలింపిక్స్’’ అని వెల్లడించింది.





Untitled Document
Advertisements