గుడ్ న్యూస్: మార్చి 29 నుంచి ‘‘ఐపీఎల్ గ్రేటెస్ట్ మ్యాచ్‌లు’’

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 12:15 PM

గుడ్ న్యూస్: మార్చి 29 నుంచి ‘‘ఐపీఎల్ గ్రేటెస్ట్ మ్యాచ్‌లు’’

ఐపీఎల్‌ 2020 సీజన్‌ కోసం అభిమానులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా రోజురోజుకి పెరిగిపోతుండటంతో ఈ ఏడాది టోర్నీ జరగడంపై సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకావాల్సి ఉంది. అయితే.. కరోనా వైరస్ కారణంగా టోర్నీని ఏప్రిల్ 15కి వాయిదా వేసిన బీసీసీఐ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై చర్చలు జరుపుతోంది. కానీ.. అవేమీ ఫలప్రదమయ్యేటట్లు కనిపించడం లేదు. దీంతో.. నిరాశ చెందుతున్న క్రికెట్ అభిమానులకి ఊరటనిచ్చేలా బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్స్ ‘‘ఐపీఎల్ గ్రేటెస్ట్ మ్యాచ్‌లు’’లను మార్చి 29 నుంచి ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించింది.


భారత్‌లో గత మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజులు లాక్‌డౌన్‌ని విధించడంతో.. అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. క్రికెట్ అభిమానుల్ని ఉత్తేజపరుస్తూ.. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 2019 వరకూ జరిగిన ఆసక్తికరమై మ్యాచ్‌లను ప్రసారం చేయాలని స్టార్ స్పోర్ట్స్ నిర్ణయించింది. ముఖ్యంగా.. చివరి ఓవర్‌లో ఫలితం తేలిన మ్యాచ్‌లు, పరుగుల వరదతో అభిమానుల్ని అలరించిన మ్యాచ్‌లను ప్రత్యేకంగా ప్రసారం చేయబోతున్నారు.


మార్చి 29 నుంచి ఐపీఎల్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న టైమ్‌లోనే ఈ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్ ప్రసారం చేయనుంది. ఈ క్రమంలో మొదటి రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ రానుంది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున ఆడిన బ్రెండన్ మెక్‌కలమ్ 73 బంతుల్లోనే 158 పరుగులు చేసి.. అభిమానులకి ఐపీఎల్ మజాని పరిచయం చేశాడు.





Untitled Document
Advertisements