కరోనా కట్టడి: రహానె రూ. 10 లక్షల విరాళం

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 01:51 PM

కరోనా కట్టడి: రహానె రూ. 10 లక్షల విరాళం

దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే క్రికెటర్లు సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా.. మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఎంపీల్యాడ్ నుంచి రూ. 1 కోటి పీఎం- కేర్స్ ఫండ్‌కి విరాళంగా అందజేశాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని పేదలకి అందజేస్తున్నాడు. భారత్‌లో ఆదివారం మధ్యాహ్నానానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 979కి చేరుకోగా.. ఈరోజుకి 25 మంది చనిపోయారు. ఇక దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో 186 మంది ఈ వైరస్ బారిన పడగా.. ఆరుగురు చనిపోయారు. దీంతో.. రూ. 10 లక్షలని మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కి అజింక్య రహానె అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. దేశంలో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. గత కొన్ని సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న రహానె ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements