కరోనాపై యుద్ధం: భారత జవాన్ల రూ. 500 కోట్లు విరాళం

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 07:58 PM

కరోనాపై యుద్ధం: భారత జవాన్ల రూ. 500 కోట్లు విరాళం

కరోనా వైరస్‌ (కోవిడ్ 19)పై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళాలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాలను అందజేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నంగా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ సంస్థ రైల్వే శాఖ భారీ విరాళం ప్రకటించగా.. తాజాగా, కేంద్ర రక్షణ ఉద్యోగులు భూరి విరాళం ప్రకటించారు. రైల్వే ఉద్యోగులు తమ ఒక్క రోజు జీతం రూ. 151 కోట్లు పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళమివ్వగా, రక్షణ శాఖ ఉద్యోగులు సైతం తమ ఒక్క రోజు వేతనం దాదాపు రూ. 500 కోట్లు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు తన ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించగా.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఒక నెల వేతనాన్ని అందజేస్తానని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 979 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది మృతి చెందారు. ‘‘పీఎం కేర్స్ ఫండ్‌కు నా ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాను. కోవిడ్ 19పై యుద్ధంలో మీరు కూడా భాగస్వామ్యమై విరాళాలు అందజేయాలని కోరుకుంటున్నా’’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements