కరోనా వైరస్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా కేంద్రానికి సాయం అందించేందుకు కీలక రెపో రేటును తగ్గించింది. ఇంకా పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిల్లో ఈఎంఐ మారటోరియం కూడా ఒకటి. 3 నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీంతో లోన్ ఈఎంఐ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వైరస్ వల్ల ఆదాయం లేకపోవడంతో నెలవారీ ఈఎంఐ కట్టలేమనే బాధ తప్పిందని భావించారు. కానీ ఇప్పుడు వారికి షాకిస్తున్నాయి ఆర్థిక సంస్థలు. ఆర్బీఐ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, అందువల్ల మీ ఈఎంఐ గడువు దగ్గరకు వస్తుండటంతో బ్యాంక్ అకౌంట్లో తగినంత డబ్బులు ఉంచుకోవాలని పలువురికి మెసేజ్లు పంపుతున్నాయి. దీంతో లోన్ తీసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, లోక్ ఏరియా బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు చెందిన కస్టమర్లు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. టర్మ్ లోన్స్కు ఈఎంఐ మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. అంటే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది. కన్సూమర్ డ్యూరబుల్ లోన్స్కు మారటోరియం ఉంటుంది. అంటే ఫ్రిజ్, స్మార్ట్ఫోన్, టీవీ వంటి వాటి కొనుగోలుకు రుణం తీసుకున్న వారు కూడా ఈఎంఐ కట్టక్కర్లేదు. క్రెడిట్ కార్డు బకాయిలకు కూడా ఈఎంఐ మారటోరియం కిందకు వస్తాయని ఆర్బీఐ తెలిపింది.