ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య 30 వేలు దాటింది. ఇప్పటిదాకా దాని బారిన పడి 33,523 మంది బలయ్యారు. 20 వేలకు పైగా మరణాలు ఒక్క యూరప్లోనే నమోదయ్యాయి. కేసులు ఏడు లక్షలు దాటాయి. 7,07,312 మందికి వైరస్ సోకింది. 1,50,732మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. ఇటలీలో ఇప్పటికే కరోనా మరణాలు పది వేలు దాటిన సంగతి తెలిసిందే. కేసులు లక్షకు చేరువలో ఉన్నాయి. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లూ బలవుతున్నారు. ఇటలీలో ఇప్పటిదాకా 50 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయినట్టు అక్కడి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ఫిలిపో అనేలి ప్రకటించారు. అందులో 17 మంది డాక్టర్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న లొంబార్డి రీజియన్కు చెందిన వారేనని చెప్పారు. వేడి వాతావరణం, ఫుట్బాల్ లీగ్, ఇతర పెద్ద కార్యక్రమాల వల్లే స్పెయిన్లో కేసులు ఎక్కువైపోయాయని అధికారులు వెల్లడించారు. అక్కడ ఒక్కరోజే 624 మంది చనిపోయారు. 78,799 కేసులు నమోదవగా, 6,606 మంది చనిపోయారు. నెదర్లాండ్స్లో మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. 10,866 కేసులకుగానూ 771 మంది చనిపోయారు. సౌత్ఆఫ్రికా జొహెన్నస్బర్గ్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించని గుంపుపై పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. చైనాలో ఇంపోర్టెడ్ కేసులు పెరిగిపోతున్నాయి. లోకల్గా కొత్త కేసులు నమోదు కానప్పటికీ, వేరే దేశాల నుంచి వస్తున్న వాళ్లతో కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. అయితే, వైరస్కు మూలమైన వుహాన్ సిటీలో లాక్డౌన్ ఎత్తేసింది చైనా. ప్రయాణ ఆంక్షలను సడలించింది. అయితే,ఈ టైంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిన తొలి బాధితులను చైనా అధికారులు గుర్తిస్తున్నారు. అందులో భాగంగా రొయ్యలు అమ్ముకుని బతికే 57 ఏళ్ల మహిళను ‘పేషెంట్ జీరో’గా గుర్తించారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలతో మానవ హక్కులు ప్రమాదంలో పడే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ సహా పలు దేశాల్లో ఇప్పటికే సైనిక వాహనాలు, పోలీసులు గస్తీ కాస్తుండడం, ఫోన్లతో నిఘా పెడుతుండడం వల్ల ప్రైవసీతో పాటు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. ఆస్ట్రేలియాలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. న్యూసౌత్వేల్స్ రాష్ట్రంలో ఆ కేసులు 40 శాతం పెరిగాయని వుమెన్స్ సేఫ్టీ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. విక్టోరియా స్టేట్లోనూ కేసులు రెట్టింపయ్యాయని పోలీసులు తెలిపారు. ఇక, కరోనాతో ఫైట్ చేసేందుకు 100 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్లను ప్రభుత్వం విడుదల చేసింది. బంగ్లాదేశ్లో ఆర్మీని రంగంలోకి దించుతున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 3,500 మంది సైనికులు వీధుల్లో పహారా కాస్తారని వెల్లడించింది. సంక్షోభ టైంలో జర్మనీ జనాలు క్రమశిక్షణతో ఉన్నారని, అందుకే మరణాల సంఖ్య తక్కువగా ఉందని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు. పాకిస్థాన్లో కేసుల సంఖ్య 1,526కి పెరిగింది. 13 మంది చనిపోయారు. కరోనా వైరస్ ఎఫెక్ట్తో బ్రిటన్ జూన్ దాకా మూతపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలకు లేఖ రాశారు.