కరోనాపై పోరాటం: మరో రూ.50లక్షలు ప్రకటించిన ప్రభాస్

     Written by : smtv Desk | Mon, Mar 30, 2020, 06:18 PM

కరోనాపై పోరాటం: మరో రూ.50లక్షలు ప్రకటించిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.4 అందజేసిన ప్రభాస్.. ఇప్పుడు సినీ కార్మికుల సహాయార్థం రూ. 50 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం వెల్లడించారు. దీంతో ప్రభాస్ విరాళం మొత్తం రూ.4.5 కోట్లకు చేరింది. కరోనా వైరస్ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు ఆర్థికంగా సాయం అవసరం. అందుకే, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా తమ వంతు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు.

ప్రభాస్ తన వంతు సాయంగా కేంద్ర ప్రభుత్వానికి రూ.3 కోట్లు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున అందజేశారు. ఇప్పుడు, తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పరిశ్రమ ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి ప్రభాస్ రూ.50 లక్షలు అందజేశారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసింది ప్రభాస్ ఒక్కరే.


ఇదిలా ఉంటే, సినీ కార్మికుల కోసం ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, నాగార్జున కోటి రూపాయలు, రామ్ చరణ్ రూ.30 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, నాగచైతన్య రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, రవితేజ రూ.20 లక్షలు, శర్వానంద్ రూ. 15 లక్షలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రూ.10 లక్షలు, విశ్వక్‌సేన్ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు, బ్రహ్మాజీ రూ.75వేలు, ఆయన తనయుడు సంజయ్ రావు రూ.25 వేలు విరాళంగా అందించారు.





Untitled Document
Advertisements