ఐపీఎల్‌ 2020కి కొత్త షెడ్యూల్..?

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 12:01 PM

ఐపీఎల్‌ 2020కి కొత్త షెడ్యూల్..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తున్నా.. ఐపీఎల్ 2020 నిర్వహణపై బీసీసీఐ ఏమాత్రం వెనక్కి తగ్గేటట్లు కనిపించడం లేదు. దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ని ఇప్పటికే ఏప్రిల్ 15కి వాయిదా వేసిన బీసీసీఐ.. పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ముల్లగుల్లాలు పడుతోంది. టోర్నీ వాయిదా పడితే సుమారు రూ. 10 వేల కోట్ల వరకూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున.. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణకి ఉన్న మార్గాలను బీసీసీఐ అన్వేషిస్తోంది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం ఉదయానికి 1,347కి చేరుకోగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 8 లక్షలకి చేరుగా ఉంది. దీంతో.. ఏప్రిల్ 15 తర్వాత కూడా ఐపీఎల్ జరగడంపై సందిగ్ధత నెలకొనగా.. ఆగస్టు- సెప్టెంబరులో టోర్నీ నిర్వహిస్తే ఎలా ఉంటుంది..? అనేదానిపై ఇప్పుడు బీసీసీఐలో చర్చ మొదలైంది. వాస్తవానికి సెప్టెంబరులో ఆసియా టీ20 కప్‌ ఆతిథ్య హక్కులు ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉన్నాయి. అయితే.. ఈ టోర్నీని పాక్ గడ్డపై నిర్వహిస్తే..? తాము అక్కడికి వెళ్లి మ్యాచ్‌లు ఆడబోమని భారత్ గతంలోనే ప్రకటించింది. దీంతో.. సుదీర్ఘ చర్చల తర్వాత యూఏఈ వేదికగా ఆసియా కప్‌ని నిర్వహించేందుకు పాక్ ఒప్పుకుంది. కానీ.. ఇప్పుడు ఆగస్టు- సెప్టెంబరులో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహిస్తే..? పాకిస్థాన్ ఆసియా కప్‌‌ని వాయిదా వేయాల్సి వస్తుంది. భారత్‌లో లేకుండా ఆసియా కప్‌‌ని నిర్వహించే సాహసం పాక్ చేయలేదు. భారత్ జట్టు సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్ జరిగేలా ఇప్పటికే షెడ్యూల్‌ని రూపొందించారు. ఇక అదే సమయంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు కూడా మ్యాచ్‌లు ఆడనుండగా.. ఆస్ట్రేలియాకి మాత్రం ఆ నెలలో ఎలాంటి సిరీస్‌లు లేవు. దీంతో.. ఇప్పుడు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులని బీసీసీఐ ఒప్పించగలిగితే..? ఐపీఎల్ 2020కి మార్గం సుగుమంకానుంది. ఇక వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు.. బీసీసీఐకి ఎదురు చెప్పే అవకాశం లేదు. ఒకవేళ చెప్పినా.. ఆ దేశ క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే ఐపీఎల్‌లో ఆడేందుకే ప్రాధాన్యమిస్తారు కాబట్టి.. వాళ్లు టోర్నీ ఆడటంపై ఎలాంటి సందేహాల్లేవు.





Untitled Document
Advertisements