కృష్ణ సినిమాపై మహేష్ ఆసక్తికర పోస్ట్!

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 04:15 PM

కృష్ణ సినిమాపై మహేష్ ఆసక్తికర పోస్ట్!

దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ‘తేనెమనసులు’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా విడుదలై నేటికి 55 ఏళ్లు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా ద్వారా నటీనటులు రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కృష్ణ.. టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా ఎదిగారు. ఐదు దశాబ్దాలపాటు అద్భుతమైన కెరీర్‌ను చూసిన ఈ 75 ఏళ్ల నటుడు 350కి పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు, తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో కొత్త జానర్లు, టెక్నికల్ అంశాలను పరిచయం చేసిన ఘనత కృష్ణది. ఇదిలా ఉంటే, ఈరోజు (మార్చి 31న) ‘తేనెమనసులు’ సినిమా 55వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ సినిమాను ప్రేక్షకులకు గుర్తుచేశారు. ఈ సినిమా తనకు ఆల్‌టైమ్ ఫేవరేట్ అని చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘‘నాకు ఎప్పటికీ ఇష్టమైన సినిమా. మరిచిపోలేని క్లాసిక్. మన ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రయాణం 55 ఏళ్ల క్రితం ఇదే రోజు ‘తేనెమనసులు’తో మొదలైంది. బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టారు. సూపర్ స్టార్ లెజండరీ జర్నీలోకి ఒక్క క్షణం వెనక్కి వెళ్దాం’’ అని మహేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, సూపర్ స్టార్ కృష్ణ నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తన ముద్ర వేశారు. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌లో ఆయన ఎన్నో సినిమాలను నిర్మించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ (1971) సినిమాతో కౌబోయ్ జానర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. అంతేకాదు తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమా (ఈనాడు - 1982), తొలి సినిమాస్కోప్ ఫిల్మ్ (అల్లూరి సీతారామరాజు - 1974), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం - 1986), తొలి డీటీఎస్ మూవీ (తెలుగు వీర లేవరా - 1995)లను పరిచయం చేసిన ఘనత ఆయనదే.






Untitled Document
Advertisements