దేశీయ రెండవ అతిపెద్ద బ్యాంకుగా PNB

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 01:08 PM

దేశీయ రెండవ అతిపెద్ద బ్యాంకుగా PNB

బ్యాంకుల విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలోనే రెండవ అతిపెద్ద జాతీయ బ్యాంక్‌గా అవతరించింది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) తనలో విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రూపురేఖలు మారాయి. భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) తర్వాత రెండవ అతిపెద్ద బ్యాంకుగా PNB అవతరించింది. వ్యాపారపరంగా రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించిన పీఎన్‌బీ తన తదుపరి విస్తరణ అవకాశాలపై దృష్టిపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీ నేపథ్యంలో జాతీయ బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. దీంతో భావితరం బ్యాంకుగా పీఎన్‌బీ నిలవనుంది.

ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. అంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్‌బీ బ్రాంచులుగా పనిచేస్తాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నోటిఫికేషన్ ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్) విలీనం బుధవారం (ఏప్రిల్ 1) అమలులోకి వచ్చింది. దేశం, వ్యాపారం, బ్రాంచ్ నెట్‌వర్క్ పరంగా తాజా విలీనం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించనుందని భావిస్తున్నారు.

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలు ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) శాఖలుగా పనిచేస్తాయి. డిపాజిటర్లతో సహా వినియోగదారులందరినీ పీఎన్‌బీ వినియోగదారులుగా పరిగణిస్తారు. విలీనం చేసిన బ్యాంకు 11,000 పైగా శాఖలు, 13,000 ఎటీఎంలు, లక్ష మంది ఉద్యోగులు, 18 లక్షల కోట్ల రూపాయల వ్యాపార మిశ్రమాల ద్వారా విస్తృత భౌగోళిక పరిధిని కలిగి ఉంటుంది. ప్రారంభ దశలోనే, పీఎన్‌బీ శాఖలన్నీ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో సహా అన్ని ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పేర్కొన్న ఇంటర్ ఆపరేబుల్ సేవలను అందించనుంది.ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సీహెచ్ఎస్ఎస్ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక క్షణంలో భాగమైనందుకు తమకు గౌరవం ఉందన్నారు. అత్యాధునిక సేవలను అందించే ఆధునిక నూతన తరం బ్యాంక్ అవుతుందన్నారు. వినియోగదారులకు మరింత సమర్థవంతంగా సేవ చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.

భారతదేశ మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1895 ఏప్రిల్ 12న లాహోర్ నుండి రూ. 2 లక్షల అధీకృత మూలధనం, రూ. 20,000 మూలధనంతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ బ్యాంక్ జాతీయవాద స్ఫూర్తితో ఏర్పాటైన భారతీయ మూలధనంతో భారతీయులు పూర్తిగా నిర్వహించే మొదటి బ్యాంకుగా గుర్తింపు దక్కించుకుంది. బ్యాంక్ సుదీర్ఘ చరిత్రలో 7 బ్యాంకులు పీఎన్‌బీలో విలీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది.





Untitled Document
Advertisements