యూకే 6 నెలలు లాక్ డౌన్? మరి ఇండియా?

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 01:11 PM

యూకే 6 నెలలు లాక్ డౌన్? మరి ఇండియా?

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకూ మరింత పెరుగుతుండడంతో యునైటెడ్ కింగ్ డమ్ లో లాక్ డౌన్ ను మరో ఆరు నెలల వరకూ పొడిగించే అవకాశం ఉన్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తుంది. వైరస్ ప్రభావం ఎక్కువ అవుతున్నందున సెప్టెంబర్ చివరి వరకూ లాక్ డౌన్ ను పొడిగించవచ్చని యూకే ప్రధాన మంత్రి సీనియర్ సలహాదారు బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఆయా పరిస్థితులకు అనుగుణంగా నివేదికల ప్రకారం సమీక్ష నిర్వహించి దీనిపై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

దీని గురించి యూకే డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జెన్నీ హారిస్ మీడియా ఎదుట ప్రస్తావిస్తూ... పెరుగుతున్న కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తే రాబోయే ఆరు నెలలకు ప్రతి మూడు వారాలకు ఒకసారి పరిస్థితి మరియు చర్యలు అంచనా వేయబడతాయి అన్నారు. సమాజంలో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరువాత అది మరలా పునరావృతం కాకుండా నివారించేలా ఆరు నెలలకు మించి నియంత్రణ చర్యలు అవసరమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు.

జూన్ వరకు ఇక్కడ లాక్ డౌన్ అమలులో ఉంటుందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేబినెట్ మంత్రి మైఖేల్ గోవ్ మీడియాతో మాట్లాడుతూ... "ఈ పరిస్థితికి సంబంధించి నేను ఖచ్చితమైన సమయాన్ని ఊహించలేను. కానీ ప్రతి ఒక్కరూ గణనీయమైన కాలం లాక్ డౌన్ కోసం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది" అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో చాలా అనిశ్చితి నెలకొని ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు నుండి ఆరు నెలలు అన్ని విషయాలు సాధారణ స్థితికి చేరుతున్నాయా? లేదా? సామాజిక మరియు భౌతిక దూరం వంటి చర్యలు ప్రభావవంతంగా ఉన్నాయా? లేదా? అని గుర్తించడానికి అనువైన సమయం అని భావిస్తున్నారు. యూకే ప్రజలు ఈ చర్యలను అనుసరించడానికి తమ వంతు కృషి చేస్తున్నారని, చాలా అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలు ఇళ్ల నుండి బయటకు వస్తున్నారని అధికారులు అంటున్నారు. ఈ ఫలితాలు బయటపడేందుకు కొంత సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

వైరస్ కేసుల సంఖ్య అధ్వాన్నంగా ఉంటుందని ముందే ఊహించినప్పటికీ ఇది మరింత పెరగకముందే దీనిని నుండి బయట పడాలని డాక్టర్ హారిస్, ప్రధాన మంత్రి జాన్సన్ తెలిపారు. దీని కోసం అన్ని సరైన సన్నాహాలు చేస్తున్నామని, మనమందరం ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తే, తక్కువ మంది ప్రాణాలు కోల్పోయినా అతి త్వరలో సాధారణ జీవన స్థితిని పొందుతామని ప్రధాన మంత్రి సూచించారు. మరో వైపు అత్యంత జనాభా కలిగిన భారతదేశంలో కూడా లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఇక్కడ రోజు రోజుకూ పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకూ 1500కు పైగా కేసులు నమోదు కాగా 45 వరకు మరణాలు సంభవించాయి. ఊహించని విధంగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే ఇతర దేశాల మాదిరిగానే ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ ను పొడిగించే అవసరం ఏర్పడుతుందని భావిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ప్రకటించిన తేదీ వరకే లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేస్తుంది. పరిస్థితులను బట్టి ఈ నిర్ణయంలో మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు.





Untitled Document
Advertisements