"ఒలింపిక్స్ స్వర్ణం నా కల"

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 02:34 PM


ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవడం తన కల అని భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ వెల్లడించింది. ఈ ఏడాది జపాన్‌లోని టోక్యో వేదికగా జులై నుంచి ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వచ్చే ఏడాదికి ఈ మెగా టోర్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో.. 37 ఏళ్ల మేరీకోమ్ ఏ మేరకు వచ్చే ఏడాదిలో పోటీపడగలదు..? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ.. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవకుండా తాను విశ్రమించనని మేరీకోమ్ స్పష్టం చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 51 కేజీల కేటగిరీలో పోటీపడిన మేరీకోమ్ కాంస్య పతకంతో సరిపెట్టింది. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌కి అర్హత సాధించలేకపోయిన ఈ దిగ్గజ బాక్సర్ 2020 టోక్యో ఒలింపిక్స్‌పై గంపెడాశలు పెట్టుకుంది. కానీ.. అనూహ్యంగా వచ్చే ఏడాదికి టోర్నీ వాయిదా పడటంతో.. ఆమె పసిడి కల నిరీక్షణ కొనసాగాలే కనిపిస్తోంది. ‘‘ఇప్పుడు నా దృష్టి అంతా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలవడంపైనే ఉంది. ఈ వయసులో ఆ లక్ష్యం కోసం నేను కఠినంగా శ్రమిస్తున్నాను. ఇక ఒలింపిక్స్‌కి ఫస్ట్ ప్లేస్‌లోనే అర్హత సాధించడం చాలా కష్టం. కానీ.. ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడిపోయాయి’’ అని మేరీకోమ్ వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగం లేకపోవడంతో గత ఏడాది 51 కేజీల కేటగిరీకి మేరీకోమ్ మారింది. దీంతో.. ఆ విభాగంలో పోటీపడుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌ అభ్యంతరం తెలపడంతో.. పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఆ నేపథ్యంలో ఇద్దరి మధ్య ట్రయల్స్ నిర్వహించారు. ఆ ఫైట్‌లో జరీన్‌ని చిత్తుగా ఓడించిన మేరీకోమ్.. ఒలింపిక్స్‌కి మార్గం సుగుమం చేసుకుంది.





Untitled Document
Advertisements