ఢిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్ ప్రార్థనల ఘటన తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న వేళ పాతబస్తీకి చెందిన ఓ కీలక నేత ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక హెల్త్ డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. కరోనా వైరస్ కారణంగా పాతబస్తీలో మరణించిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఇంటింటి పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ బుధవారం (ఏప్రిల్ 1) సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.
పాతబస్తీలోని అజంపుర, దబీర్పురా, చంచల్గూడ, కుర్మగూడ, ఛావ్నీ, బాగ్ ఇ జహేరా, షా కాలనీ తదితర ప్రాంతాల్లో హెల్త్ డ్రైవ్ చేపట్టాలని అంజద్ ఉల్లా ఖాన్ కోరారు. ఢిల్లీలో మార్చి 13 నుంచి 17 మధ్య నిర్వహించిన మర్కద్ మత సమావేశాలకు తెలంగాణ నుంచి 1030 మందికి పైగా హాజరయ్యారు. హైదరాబాద్ నగర పరిధిలోనే 603 మంది ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. మర్కజ్ కార్యక్రమంలో పాల్గొన్నవారికే ఎక్కువగా కరోనా పాజిటివ్గా తేలుతుండటం అందుక్కారణం.
మర్కజ్ ఘటన కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ఘటన గురించి కేంద్రానికి తొలుత సమాచారం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. అయితే.. రాష్ట్రంలో కరోనా మూడో దశకు వెల్లలేదని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం మరింత యాక్టివ్గా పని చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.