కరోనా కట్టడికి శ్రీలంక స్పిన్నర్ భారీ విరాళం

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 12:00 PM

కరోనా కట్టడికి శ్రీలంక స్పిన్నర్ భారీ విరాళం

కరోనా వైరస్ కట్టడి కోసం శ్రీలంక ప్రభుత్వానికి ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ భారీ విరాళం ప్రకటించాడు. భారత్‌తో పోలిస్తే.. శ్రీలంకలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తక్కువే అయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ దేశంలో లాక్‌డౌన్‌ని విధించారు. భారత్‌లో గురువారం ఉదయానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలకి చేరుకోగా.. 56 మంది చనిపోయారు. శ్రీలంకలో మాత్రం ఇప్పటి వరకూ 146 కేసులే నమోదవగా.. ఇందులో ముగ్గురు చనిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. ఈరోజు ఉదయానికి కరోనా కేసులు 9,35,959గా ఉండటం అందర్నీ ఆందోళనపరుస్తోంది. శ్రీలంకలో కరోనా వైరస్ కట్టడి కోసం తన వంతు సాయంగా 5 మిలియన్లు (శ్రీలంక రూపాయలు) విరాళంగా అందిస్తున్నట్లు ముత్తయ్ మురళీధరన్ ప్రకటించాడు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని సూచించిన మురళీధరన్.. గవర్నమెంట్ ఒక్కటే అన్నీ చూసుకోలేదని గుర్తు చేశాడు. కాబట్టి.. మీకు చేతనైనంత సాయం చేయాలని ఈ దిగ్గజ స్పిన్నర్ సూచించాడు. భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం రోహిత్ శర్మ రూ. 80 లక్షలు, సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, రహానె రూ. 10 లక్షలు విరాళం ఇవ్వగా.. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి రూ. 3 కోట్లు విరాళం అందజేశాడు.





Untitled Document
Advertisements