మోదీ ఆసక్తికర ట్వీట్...వైరల్

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 07:05 PM

మోదీ ఆసక్తికర ట్వీట్...వైరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 3) ఉదయం 9 గంటలకు తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఓ వీడియో షేర్ చేయనున్నట్లు తెలిపారు. ఆ వీడియో ద్వారా భారతీయులందరికీ చిన్న సందేశం ఇవ్వదలిచిట్లు గురువారం సాయంత్రం ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అరగంట వ్యవధిలో 10 వేల మందికి పైగా దీన్ని రీట్వీట్ చేయగా.. 50 వేల మంది లైక్ చేశారు. దీని గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. గురువారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని.. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఏదైనా కీలక ప్రకటన చేయొచ్చునని చాలా మంది భావిస్తున్నారు. అలాంటిదేదీ ఉండబోదన్నది మరికొందరి అభిప్రాయం. అయితే.. దీనిపై చాలా మంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘మీ ప్రకటన చూస్తే.. నాకు నాటి రాత్రి 8 గంటల సమయం గుర్తొస్తోంది.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు’. 2016 సెప్టెంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన సంచలన ప్రకటన గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. మోదీ ట్వీట్‌తో ఇక మీడియా వాళ్లకు పండగే అంటూ మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉండొచ్చు. యోగాసనాలపై ఇటీవల ఆయన చేసిన ట్వీట్‌‌‌కు వండర్‌ఫుల్ అంటూ ఇవాంక ట్రంప్ రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతతో పాటు, రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చంటూ గత ఆదివారం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. శ్రోత కోరిక మేరకు మరుసటి రోజు యోగా వీడియో షేర్ చేశారు. అది వైరల్‌గా మారింది. కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ తొలుత జనాతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. అనంతరం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. మోదీ లాక్‌డౌన్ ప్రసంగం నయా రికార్డులను నెలకొల్పింది. దీన్ని అత్యధికంగా 19.7 కోట్ల మంది వీక్షించారని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్‌ ఇండియా) వెల్లడించింది. దీన్ని 201 ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్‌ ట్వీట్‌ చేశారు. గతంలో ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలకు అత్యధిక వ్యూయర్‌షిప్ ఉండగా.. తాజాగా లాక్‌డౌన్ ప్రసంగానికి రెండింతల వ్యూయర్‌షిప్ దక్కింది. ఇప్పటివరకు ఐపీఎల్‌ ఫైనల్‌కు అత్యధిక వ్యూయర్‌షిప్ (13.3 కోట్ల మంది వీక్షించారు) ఉండగా.. మోదీ లాక్‌డౌన్ ప్రసంగం దాన్ని అధిగమించింది.






Untitled Document
Advertisements