స్పెయిన్‌లో @10 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య...

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 07:07 PM

స్పెయిన్‌లో @10 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య...

స్పెయిన్‌లో కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పది వేలు దాటింది. ఒక్క రోజులోనే తమ దేశంలో కోవిడ్ కారణంగా 950 మంది మరణించారని స్పెయిన్ ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీంతో కోవిడ్ కారణంగా ఒక్కరోజులో ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ యూరోపియన్ దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య లక్ష దాటి 110,238కు చేరింది. గత కొద్ది రోజులుగా స్పెయిన్‌లో కోవిడ్ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. స్పెయిన్‌లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 10,003 మంది ప్రాణాలు వదిలారు. కాగా ఇప్పటికీ ఆరు వేల మందికిపైగా ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ కారణంగా పది వేలకు పైగా మరణాలు నమోదైన రెండో దేశం స్పెయిన్. ఇప్పటికే ఇటలీలో 110,574 మంది కోవిడ్ బారిన పడగా... 13,155 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజుల నుంచి ఇటలీలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించింది. మరోవైపు అమెరికాలో కరోనా మృతుల సంఖ్య ఐదు వేలు దాటింది. ఇక్కడ 2 లక్షల 15 వేల మందికిపైగా కోవిడ్ సోకగా.. 5110 మంది బలయ్యారు. ఒక్క న్యూయార్క్‌లోనే దాదాపు 2 వేల మంది కరోనా వల్ల చనిపోయారు.





Untitled Document
Advertisements