లాక్ డౌన్ త‌ర్వాత‌ ఈ స‌బ్జెక్టుల‌కు మాత్ర‌మే బోర్డ్ ఎగ్జామ్...

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 08:14 PM

లాక్ డౌన్ త‌ర్వాత‌ ఈ స‌బ్జెక్టుల‌కు మాత్ర‌మే బోర్డ్ ఎగ్జామ్...

దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీబీఎస్ఈ (సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్)కి 10, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కొన్ని సూచ‌న‌లు చేసింది. ఉన్న‌త విద్యా ప్ర‌వేశాల్లో కీల‌క‌మైన 29 స‌బ్జెక్టుల‌కు మాత్ర‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని చెప్పారు కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేశ్ నిశాంక్. లాక్ డౌన్ తర్వాత ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు వీలైన స‌మ‌యంలో 29 స‌బ్జెక్టుల్లో ప‌రీక్షలు పెట్టేందుకు షెడ్యూల్ ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న సూచించారు. మిగిలిన స‌బ్జెక్టుల‌కు సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఆ స‌బ్జెక్టుల‌కు మార్కులు ఎలా ఇవ్వాల‌న్న దానిపై త్వ‌ర‌లో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేస్తామ‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని ఆయ‌న అధికారిక ట్విట్ట‌ర్ లోపోస్ట్ చేశారు. ఒక‌టి నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు లేకుండా పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయాల‌ని కేంద్ర మంత్రి సూచించారు. అలాగే 9, 11వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను వారి ఇంట‌ర్న‌ల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా ప్ర‌మోట్ చేయాల‌ని చెప్పారు. సీఏఏ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఈశాన్య ఢిల్లీలో ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు కొన్ని వాయిదా ప‌డ్డాయి. దేశంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో సీబీఎస్ఈ టెన్త్ ప‌రీక్ష‌లు పూర్త‌య్యాయి. 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మాత్రం క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో దేశ‌మంతా వాయిదా ప‌డ్డాయి.







Untitled Document
Advertisements