అమ్మకానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం...ధర రూ.30వేల కోట్లు!

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 12:09 PM

అమ్మకానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం...ధర రూ.30వేల కోట్లు!

ప్రధాని నరేంద్ర మోదీ 2018 అక్టోబరు 31న ఆవిష్కరించిన ఐక్యతా విగ్రహం గుర్తుందా? అదేనండి.. గుజరాత్‌లోని నర్మదా నది తీరంలో సాధుబెట్ అనే చిన్న దీవిలో ఏర్పాటు చేసిన 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టేశారు. రూ.30వేల కోట్లు చెల్లించి దీన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే, దీన్ని విక్రయిస్తున్నది ప్రభుత్వం కాదు, ఓ నెటిజన్. నమ్మబుద్ధి కావడం లేదు కదా.

ఔనండి, ఇటీవల ‘OLX’ వెబ్‌సైటులో గుర్తుతెలియని వ్యక్తి ఈ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. అయితే, దీని వెనుక ఆలోచింపజేసే విషయం ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రం సంధించేందుకు ఓ వ్యక్తి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇంతకీ అతడు ఈ విగ్రహాన్ని ఎందుకు అమ్మకానికి పెట్టాడు? కరోనా వైరస్‌కు, దీనికి సంబంధం ఏమిటనేగా మీ సందేహం. అయితే, చూడండి.


‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో నిర్మించిన ఈ విగ్రహానికి ప్రభుత్వం రూ.3 వేల కోట్లను వెచ్చించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ విగ్రహం కొన్నాళ్లు పర్యాటక కేంద్రంగా వెలుగొందింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఓ వ్యక్తి దీన్ని అమ్మకానికి పెట్టాడు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహాం ఫొటోలను అప్‌లోడ్ చేసి రూ.30 వేల కోట్లకు అమ్మేస్తున్నట్లు తెలిపాడు. ‘‘అత్యవసర పరిస్థితుల్లో ఈ ఐక్యతా విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాం. ఈ డబ్బులతో హాస్పిటళ్లు, వైద్య పరికరాలను కొనుగోలు చేయాలి’’ అని అందులో పేర్కొన్నాడు.


కరోనా వైరస్ బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం కొన్ని వేల కోట్లను వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. దీనిపై ఓ వ్యక్తి వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తూ ఓలెక్స్‌లో విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. రూ.3వేల కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేసే బదులు.. ఆ డబ్బును ప్రజల కోసం దాచి పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పే ప్రయత్నంలో ఈ చర్యకు పాల్పడ్డాడు.


విగ్రహం అమ్మకానికి పెట్టినట్లు తెలియగానే OLX నిర్వాహకులు దాన్ని సైటు నుంచి తొలగించారు. గుర్తుతెలియని వ్యక్తులు సరదాగా ఆ పనిచేశారని క్షమాపణలు తెలిపింది. అయితే, అప్పటికే ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాకు చిక్కేశాయి. వీటిని కొందరు ‘రెడిట్’లో పోస్టు చేసి.. ‘‘ఇండియాలో ఆరోగ్య రంగానికి అత్యవసరం డబ్బు అవసరమైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అమ్మేస్తున్నారని ప్రచారం చేశారు’’. దీనిపై నెటిజనులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ‘‘మహానుభావుల విగ్రహాలను పెట్టి స్మరించుకోవడంలో తప్పులేదు. కూడు గూడుకు గతిలేని పేదలున్న ఈ దేశంలో.. గొప్పల కోసం వేల కోట్లు వెచ్చించడం న్యాయం కాదు’’ అని నెటిజనులు కామెంట్లు చేస్తు్న్నారు.





Untitled Document
Advertisements