కరోనా భూతాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా దేశ పౌరులందరూ ఆదివారం తమ నివాసాల్లో 9 గంటలకు లైట్లు ఆర్పి 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చిలైట్లు, మొబైల్ ఫోన్ లైట్లు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామి స్పందించారు. ప్రధాని మోదీ పిలుపును పాటిద్దామని అన్నారు. దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, దేశానికి ఉపయోగపడే పనులు చేయడంలో అందరం కలసికట్టుగా సాగాలని తెలిపారు.
"ప్రధాని మనల్నేమీ కొండలు ఎత్తమనలేదు, కషాయం తాగమని చెప్పలేదు. గుంజీలు తీయమని అంతకన్నా చెప్పలేదు. రాత్రిపూట 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించమని చెప్పారు. దీపాలు వెలిగించడం ఎంతో మంగళకరం. దేశమంతా ఒక్కటేనన్న భావన అందరిలో కలిగించే ప్రయత్నమిది. ఏదైనా అందరితో ఒకే పని చేయించడం ద్వారా మనమంతా ఒక్కటేనన్న స్ఫూర్తి వస్తుంది. మంచి నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగిస్తే వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది" అని వివరించారు.