రోహిత్ ను చూస్తే యువీకి పాక్ క్రికెటర్ గుర్తుకు వచ్చాడంట

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 05:48 PM

రోహిత్ ను చూస్తే యువీకి పాక్ క్రికెటర్ గుర్తుకు వచ్చాడంట

భారత జాతీయ జట్టులో మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా రోహిత్ శర్మ కుదురుకున్నాడు. గత ఏడాది వరకు లిమిటెడ్ ఓవ‌ర్ల‌కే పరిమితమైన హిట్‌మ్యాన్‌.. దక్షిణాఫ్రికాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో ఓపెనర్ గా ప్రమోషన్ పొంది సూపర్ హిట్ అయ్యాడు. అయితే రోహిత్ గురించి తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర విషయం తెలిపాడు. తనను తొలిసారి చూసినప్పుడు పాకిస్తాన్ ప్లేయర్ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ గుర్తుకు వచ్చాడని పేర్కొన్నాడు. రోహిత్‌ బ్యాటింగ్ శైలి, క్రీజులో లేజీనెస్ కాస్త ఇంజీని పోలి ఉంటుంది. అలాగే బౌల‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు ఇద్ద‌రి వ‌ద్ద చాలా స‌మ‌యం ఉంటుంద‌ని చ‌మ‌త్క‌రించాడు.


ఇక 2007 టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు త‌ర‌పున‌ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తర్వాత ఏడేళ్లకు జ‌ట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా 2013 చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్ గా ప్ర‌మోష‌న్ పొందాక‌ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో రోహిత్ దూసుకుపోయాడు. వన్డేల్లో ఏకంగా 27 సెంచరీలు నమోదు చేశాడు. 59కిపైగా స‌గటుతో 7,600 పైగా పరుగులు సాధించాడు. అలాగే టీ20ల‌లో 4 శతకాలు బాదాడు.


ఇక రోహిత్‌ శర్మ కెరీర్‌లో 2019 వ సంవత్సరం గుర్తుండి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో తను ఐదు సెంచరీలు సాధించి, ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. అలాగే టెస్టుల్లోనూ ఓపెన‌ర్‌గా ప్రమోషన్ పొంది జట్టులో తన స్థానాన్ని సుస్థిర‌ప‌ర్చుకున్నాడు. ప్ర‌స్తుతం క‌రోనా వైరస్ కారణంగా క్రికెట్‌ కార్యకలాపాలు వాయిదా పడటంతో.. క్రికెటర్లు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈనెల 14 తర్వాత మ‌నదేశంలో లాక్‌డౌన్‌పై కేంద్రం నిర్ణ‌యం తీసుకోనుంది. అనంత‌రం క్రీడా టోర్నీల‌పై కూడా ఒక స్ప‌ష్ట‌త రానుంది.





Untitled Document
Advertisements