హాట్ స్పాట్ ఏరియాల్లో కొత్త క్వారంటైన్ ప్లాన్

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 07:35 PM

వివిధ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైన కార్యాచరణను రూపొందించింది. కొత్త ప్లాన్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ లో... కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాలను బఫర్ జోన్లుగా విభజించడం, ఒక నెల పాటు పూర్తిగా నిర్బంధించడం వంటివి ఉన్నాయి.

ఈ ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు రావడం కానీ, అక్కడకు వెళ్లడం కానీ ఉండదు. కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరినీ ఐసొలేషన్ కు తరలించనున్నారు. టెస్టుల్లో రెండు సార్లు నెగెటివ్ వస్తేనే వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేస్తారు. తక్కువ లక్షణాలు ఉన్నవారిని స్టేడియంలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్స్ లో ఉంచుతారు. ఒక స్థాయిలో లక్షణాలు ఉన్నవారిని హాస్పిటల్స్ లోని కరోనా వార్డులకు తరలిస్తారు. తీవ్ర స్థాయిలో లక్షణాలు ఉన్నవారిని అత్యున్నత సదుపాయాలు ఉన్న ఆసుపత్రులకు పంపుతారు.

కరోనా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలను మూసివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాచరణలో ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థను పూర్తిగా బంద్ చేస్తారు. కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. క్వారంటైన్ జోన్ లో కనీసం నాలుగు వారాల పాటు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోతే... ఆ ప్రాంతంలో క్వారంటైన్ ప్లాన్ ను సడలిస్తారు. ముఖ్యంగా హాట్ స్పాట్ ఏరియాల్లో కొత్త క్వారంటైన్ ప్లాన్ ను కఠినంగా అమలు చేయబోతున్నారు.





Untitled Document
Advertisements