ఆ సిక్స్ చూసి ద్రవిడ్ కోప్పడ్డాడు: శ్రేయాస్

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 11:42 AM

ఆ సిక్స్ చూసి ద్రవిడ్ కోప్పడ్డాడు: శ్రేయాస్

భారత్ జట్టుని నాలుగేళ్లపాటు వేధించిన నెం.4 బ్యాట్స్‌మెన్ సమస్యని శ్రేయాస్ అయ్యర్ కేవలం మూడు నెలల్లోనే తీర్చేశాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు.. ఆఖర్లో కళ్లుచెదిరే సిక్సర్లతో స్కోరు బోర్డుని అమాంతం పెంచడంలో శ్రేయాస్‌ అయ్యర్‌ సిద్ధహస్తుడు. దీంతో.. నెలల వ్యవధిలోనే భారత వన్డే, టీ20 జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయిన ఈ యువ హిట్టర్.. ఇప్పుడు టెస్టు క్రికెట్‌పై కన్నేశాడు. కానీ.. కెరీర్ ఆరంభంలో తన దూకుడు కారణంగా భారత్- ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆగ్రహానికి గురైనట్లు శ్రేయాస్ వెల్లడించాడు. ‘‘ఫస్ట్ క్లాస్ కెరీర్ ఆరంభించిన కొత్తలో నాలుగు రోజుల మ్యాచ్‌‌ని ఆడుతుండగా.. తొలిరోజు చివరి ఓవర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం నాకు లభించింది. దీంతో.. అందరూ నేను వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడతానని ఊహించారు. కానీ.. బౌలర్ ఊరిస్తూ ఫ్లైటెడ్ డెలివరీ విసరడంతో నేను క్రీజు వెలుపలికి వెచ్చి భారీ షాట్ ఆడేశాను. బంతి చక్కగా బ్యాట్‌కి కనెక్ట్ కావడంతో.. భారీ సిక్స్‌గా వెళ్లింది. ఆ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ అక్కడే కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్నాడు. బంతి వెళ్లిన తీరు చూసి టీమ్‌లోని సహచర క్రికెటర్లు డ్రెస్సింగ్ రూము నుంచి వెలుపలికి వచ్చి మరీ.. ఆఖరి ఓవర్‌లో ఈ షాట్ కొట్టింది ఎవరు..? అనేలా చూశారు. అయితే.. ఆ రోజు ఆట ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ వచ్చి ‘బాస్.. వాట్ ఈజ్ దిస్..?’ అని కోప్పడ్డాడు’’ అని శ్రేయాస్ వెల్లడించాడు. మ్యాచ్‌ తొలి రోజు ఆఖర్లో బ్యాటింగ్‌ వెళ్లిన శ్రేయాస్.. సిక్స్ కొట్టే సమయానికి 30 పరుగులు మాత్రమే చేశాడు. అదీ.. ఆఖరి ఓవర్ కావడంతో జాగ్రత్తగా ఆడాలి తప్ప ఇలా బంతిని గాల్లోకి లేపేస్తారా..? అనే తరహాలో తన వైపు కోపంగా చూస్తూ ద్రవిడ్ చరకలేసినట్లు శ్రేయాస్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌కి శ్రేయాస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదా పడిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements