2011 ప్రపంచకప్ హీరో ఎవరు?...సిక్స్ తో క్రెడిట్ మొత్తం ధోనీ కొట్టేశాడా?

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 11:53 AM

2011 ప్రపంచకప్ హీరో ఎవరు?...సిక్స్ తో క్రెడిట్ మొత్తం ధోనీ కొట్టేశాడా?

భారత్ జట్టు 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో గెలవడానికి ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు బాగా దోహదపడిందని సుదీర్ఘకాలంగా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ.. ఆ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్ మార్పునకి కారణం సచిన్ టెండూల్కర్ అని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ చాలా సార్లు ఈ మ్యాచ్‌ గురించి మాట్లాడిన ధోని.. తన బ్యాటింగ్ ఆర్డర్ మార్పునకి ఒకే కారణం చెప్తూ వచ్చాడు. ‘‘కోహ్లీ ఔటయ్యే సమయానికి దిల్షాన్, ముత్తయ్ మురళీధరన్‌లు బౌలింగ్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మురళీధరన్‌తో అప్పటికే కలిసి ఆడి ఉండటంతో.. అతని బౌలింగ్‌పై నాకు పూర్తి స్పష్టత ఉంది. దాంతో.. యువరాజ్‌ సింగ్‌కి బదులుగా ఐదో స్థానంలో నేను బ్యాటింగ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అది ఫలితాన్ని ఇచ్చింది’’ అని ధోనీ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ.. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పునకి సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఫస్ట్ వ్యూహం రచించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మరి ధోనీ ఎందుకు వారి పేర్లని ప్రస్తావించలేదంటే..?




ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగింది..?

ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా 2011, ఏప్రిల్ 2న జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ టీమ్‌లో మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) సెంచరీతో చెలరేగాడు. కుమార సంగక్కర (48), తిలకరత్నె దిల్షాన్ (33), నువాన్ కులశేఖర (32) నిలకడగా ఆడినప్పటికీ.. వారి ఇన్నింగ్స్‌ల్లో దూకుడు లోపించింది. మరోవైపు భారత బౌలర్లలో జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ సింగ్ ఒక వికెట్ తీశాడు. 275 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లు చేజార్చుకుని ఒత్తిడిలో పడింది. అయినప్పటికీ మొండిగా క్రీజులో నిలిచిన గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4) అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి కాసేపు సహకారం అందించిన విరాట్ కోహ్లీ (35: 49 బంతుల్లో 4x4) దిల్షాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు. అప్పటికి భారత్ స్కోరు 21.4 ఓవర్లలో 114/3. ఈ దశలో రెగ్యులర్‌గా ఐదో స్థానంలో యువరాజ్ సింగ్ క్రీజులోకి వస్తాడని అంతా ఊహించారు. కానీ.. యువీకి బదులుగా బ్యాటింగ్‌కి వచ్చిన ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6) అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. తనదైన శైలిలో సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన విరాట్ కోహ్లీ ఔటవ్వక ముందు నుంచే సచిన్, సెహ్వాగ్ ఒక వ్యూహం సిద్ధం చేయగా.. ధోనీ కూడా ఓ వ్యూహాన్ని రచించాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సచిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కాంబినేషన్ శ్రీలంకని ఇబ్బంది పెట్టగలిగింది. కాబట్టి... ఆ మ్యాచ్ సమయంలో నా పక్కనే ఉన్న సెహ్వాగ్‌తో నా వ్యూహాన్ని వివరించి అప్పటి కెప్టెన్ ధోనీకి వెళ్లి చెప్పమని చెప్పా. నాకు అప్పటికి ఉన్న సెంటిమెంట్ ప్రకారం.. నేను ఉన్న చోట నుంచి కదలకూడదని నిర్ణయించుకున్నా’’ అని సచిన్ టెండూల్కర్ గుర్తు చేసుకున్నాడు. ‘‘గంభీర్ ఔటైతే ఎడమ చేతి వాటం ఉన్న యువరాజ్ సింగ్‌ బ్యాటింగ్‌కి వెళ్లాలి. ఒకవేళ విరాట్ కోహ్లీ ఔటైతే..? అతని స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కి వెళ్లాలి. ఆ టోర్నీలో యువరాజ్ భీకర ఫామ్‌లో ఉన్నాడని నాకు తెలుసు. కానీ.. శ్రీలంక వరుసగా ఇద్దరు అగ్రశ్రేణి ఆఫ్‌ స్పిన్నర్లతో అప్పుడు బౌలింగ్ చేయిస్తోంది. కాబట్టి.. ఆఖరిగా ఎవరు ఔటైనా.. ధోనీనే పంపాలని సెహ్వాగ్‌తో కలిసి నిర్ణయించుకుని బాల్కనీలో ఉన్న ధోనీకి వెళ్లి చెప్పమన్నాను. కానీ.. అప్పటికే ధోనీ డ్రెస్సింగ్ రూము వైపు ధోనీ వస్తుండటాన్ని చూశా’’ అని సచిన్ వెల్లడించాడు. ధోనీకి సచిన్ తన వ్యూహం చెప్పడం నిజమని సెహ్వాగ్ కూడా అంగీకరించాడు. ‘‘అవును.. ధోనీకి తన వ్యూహం గురించి సచిన్ నా ముందే అతనికి చెప్పాడు. వాస్తవానికి నేను ధోనీ వద్దకి వెళ్లి ఆ వ్యూహం చెప్దామని వెళ్లబోయేలోపే.. ధోనీనే స్వయంగా డ్రెస్సింగ్ రూము వైపు వస్తుండటాన్ని మేము చూశాం. ఆ తర్వాత సచిన్ నాకు చెప్పిన వ్యూహాన్ని ధోనీకి కూడా చెప్పాడు. అనంతరం ధోనీ వెళ్లి అప్పటి కోచ్ గ్యారీ కిరెస్టన్‌కి చెప్పడం.. అతను అంగీకరించడం చకచకగా జరిగిపోయాయి’’ అని సెహ్వాగ్ వెల్లడించాడు. కానీ.. సచిన్, సెహ్వాగ్ ఆ వ్యూహం గురించి తనకి చెప్పినట్లు ధోనీ ఇప్పటి వరకూ ఎక్కడా బహిర్గతం చేయలేదు. ఆ మ్యాచ్ ఫినిషింగ్ సిక్స్ కొట్టి క్రెడిట్ మొత్తం ధోనీ కొట్టేశాడని ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ టోర్నీలో అప్పటి వరకూ క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌లను గెలిపించిన యువరాజ్‌ని ఫైనల్లో ఉద్దేశపూర్వకంగానే ధోనీ వెనక్కి నెట్టాడనే అపవాదు ఉంది. అప్పటి నుంచి ధోనీపై ఎప్పుడు ఛాన్స్ దొరికినా యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ విరుచుకుపడుతూనే ఉన్నాడు. ఇక గౌతమ్ గంభీర్ ఆ మ్యాచ్‌లో తన సెంచరీ చేజారడానికి కారణం ధోనీ అని బహిరంగంగానే విమర్శించాడు. అప్పటి వరకూ శతకం ఆలోచన లేని తనకి.. 97 పరుగుల వద్ద ఉన్నావు అని ధోనీ మరీ మరీ గుర్తుచేయడంతోనే తన ఏకాగ్రత చెదిరిందని గంభీర్ ఆరోపించాడు.





Untitled Document
Advertisements