బీజేపీ 40వ ఆవిర్బావ దినోత్సవం... కార్యకర్తలకు విభిన్నమైన టాస్క్

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 12:05 PM

బీజేపీ 40వ ఆవిర్బావ దినోత్సవం... కార్యకర్తలకు విభిన్నమైన టాస్క్

దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి చేపట్టిన పోరులో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చిన ప్రధాని.. కోవిడ్-19పై పోరులో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ తాజాగా బీజేపీ కార్యకర్తలకు విభిన్నమైన టాస్క్ ఇచ్చారు. సోమవారం (ఏప్రిల్ 6) భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరోనా వైరస్‌పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట ఆహారం మానెయ్యాలన్న పార్టీ సూచనను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు.

ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో అనేక మంది కార్యకర్తలు కృషి చేశారని.. వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. అంతకు ముందు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని, ఆ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌కు నివాళులర్పించాలని నడ్డా కోరారు. లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వివిధ రూపాల్లో సంఘీభావం తెలియజేయాలని, అందులో భాగంగా ఒకపూట భోజనం తీసుకోకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ‘ఫీడ్‌ ద నీడ్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఆరుగురికి ఆహారం అందజేయాలని కోరారు. వచ్చే వారం బూత్ స్థాయిలో ప్రతిఒక్కరూ మరో ఇద్దరికి ఇంట్లో తయారుచేసిన మాస్క్‌లు అందజేయాలని.. మాస్క్‌లు తయారీ, పంపిణీకి సంబంధించిన వీడియోలను #WearFaceCoverStaySafe పేరుతో షేర్ చేయాలన్నారు. ఈ కష్ట సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ధన్యవాద లేఖలు ఇవ్వాలని అన్నారు. స్థానికంగా ఉండే కరోనా యోధులకు ఈ లేఖలు ఇవ్వాలన్నారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త మరో 40 మంది ఒక్కొక్కరు పీఎం కేర్స్ ఫండ్‌కు కనీసం రూ.100 విరాళం ఇచ్చేలా ప్రేరణ కల్పించాలన్నారు. బూత్ స్థాయిలో 40 ఇళ్లను తిరిగి, సంతకాలు సేకరించాలి.. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికలు, వైద్యులు, నర్సులు, బ్యాంకు, పోస్టల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేయాలన్నారు.





Untitled Document
Advertisements