"నిజాలు చెప్పినందుకు పీసీబీ నా కెరీర్ ను ముగించింది"

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 05:08 PM


పాకిస్థాన్ విజయవంతమైన కెప్టెన్లలో యూనిస్ ఖాన్ కూడా ఒకడు. అతని కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టు తొలిసారి 2009లో టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. కానీ.. ఆ టోర్నీ ముగిసిన ఆరు నెలల వ్యవధిలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యూనిస్‌ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. జట్టులో రాజకీయాలపై అప్పట్లో పీసీబీకి నిజాయతీగా చెప్పడమే తాను చేసిన తప్పు అని తాజాగా యూనిస్ ఖాన్ వెల్లడించాడు. ‘‘నిజాలు మాట్లాడితే జీవితంలో ఎదురు దెబ్బలు సహజం. ఇంకా చెప్పాలంటే పిచ్చోడిగా చిత్రీకరిస్తారు. నేను చేసిన పెద్ద తప్పు.. జట్టులోని కొంత మంది క్రికెటర్లు పాక్ తరఫున నిజాయతీగా మ్యాచ్‌లు ఆడటం లేదని చెప్పడమే. అప్పట్లో జట్టులోని రాజకీయాల కారణంగా కొంత మంది ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఔటైపోయేవారు. నేను ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ క్రికెటర్లు నాతో కలిసి మ్యాచ్‌లు ఆడారు. అయితే.. వారు చేసిన తప్పునకి ఆ తర్వాత పశ్చాతాపం వ్యక్తం చేశారు. నిజాలు చెప్పడం, నిజాయతీగా ఉండటాన్ని నా తండ్రి నుంచి నేను నేర్చుకున్నాను’’ అని యూనిస్ ఖాన్ వెల్లడించాడు. 2009లో న్యూజిలాండ్, పాకిస్థాన్‌ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోనూ.. పాకిస్థాన్‌ ఆటగాళ్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ రాణా నవీద్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘న్యూజిలాండ్‌తో ఓ రెండు వన్డేల్లో మేము ఓడిపోయాం. దానికి కారణం టీమ్‌లోని కొంత మంది క్రికెటర్లు ఉదాసీనంగా ఆడటమే’’ అని వెల్లడించాడు. టెస్టుల్లో 10,099 పరుగులు చేసిన యూనిస్ ఖాన్.. వన్డేల్లో 7249 పరుగులు చేశాడు. మొత్తంగా.. 41 సెంచరీలతో 2017లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ని ముగించాడు.






Untitled Document
Advertisements