కేరళ సేల్స్‌మన్‌కు దుబాయ్‌లో రూ.20 కోట్ల లాటరీ

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 05:15 PM

కేరళ సేల్స్‌మన్‌కు దుబాయ్‌లో రూ.20 కోట్ల లాటరీ

ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న ఓ భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఏకంగా రూ.20 కోట్లు గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి 10 మిలియన్‌ దిర్హమ్స్‌ (భారత కరెన్సీలో రూ.20 కోట్లు) గెలుచుకున్నట్లు తెలుపగా.. తొలుత అతడు నమ్మలేదట. తీరా వెబ్‌సైట్‌లో తన లాటరీ నెంబర్ చెక్ చేసుకున్న తర్వాత కన్‌ఫార్మ్ చేసుకున్నాడట. కేరళలోని త్రిశ్శూర్‌కు చెందిన దిలీప్‌ కుమార్ ఎల్లికొట్టిల్ పరమేశ్వరన్‌ యూఏఈలోని అజ్మాన్‌ నగరంలో ఓ ఆటోమొబైల్ సంస్థలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట అతడు అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా మూడో తేదీన బిగ్‌ టికెట్ డ్రా పేరుతో నిర్వహించే లాటరీ టికెట్‌ను 500 దిర్హమ్స్‌ (రూ.10 వేలు) పెట్టి కొనుగోలు చేశాడు. ఈ సారి తీసిన లాటరీ డ్రాలో దిలీప్‌‌కు జాక్‌పాట్ తగిలింది. దిలీప్ గత 17 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి అజ్మాన్ నగరంలో నివాసం ఉంటున్నాడు. కరోనా కష్టకాలంలో లాటరీలో పెద్ద మొత్తం గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. గెలుచుకున్న మొత్తంలో కొంత సొమ్ముతో తనకున్న బ్యాంక్‌లోన్‌కు చెల్లించి, మిగిలిన సొమ్మును తన ఇద్దరు పిల్లల చదువుల కోసం వినియోగించనున్నట్లు దిలీప్‌ తెలిపాడు. దుబాయ్‌లో కేరళకు చెందిన పలువురు భారతీయులు లాటరీలో పెద్ద మొత్తం గెలుచుకోవడం విశేషం. 2018 జులైలో తజో మథ్యూ (30) 1.9 మిలియన్ దిర్హమ్స్ విలువైన లాటరీ గెలుచుకున్నాడు. అంతకుముందు కేరళకు చెందిన మొహమ్మద్ కున్హీ మయ్యాల (42) రూ. 14 కోట్ల విలువైన లాటరీ గెలుచుకున్నాడు. 15 ఏళ్లుగా అబుదాబిలో ఓ బట్టల దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న అతడు.. గెలుచుకున్న మొత్తంలో కొంత సొమ్ముతో తన బంధువు చికిత్స కోసం ఖర్చు చేశాడు.







Untitled Document
Advertisements