ఏడాది పాలనపై సీఎం జగన్ ప్రోగ్రెస్ కార్డ్...3.5 కోట్ల మందికి రూ. 40 వేల కోట్లు ఖర్చు!

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 09:02 PM

ఏడాది పాలనపై సీఎం జగన్ ప్రోగ్రెస్ కార్డ్...3.5 కోట్ల మందికి రూ. 40 వేల కోట్లు ఖర్చు!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక పథకాలు ప్రవేశపెట్టామని, మే 20వ తేదీ వరకు 3,57,51,612 మందికి లబ్ధి చేకూరిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల కోసం ఇప్పటి వరకు రూ. 40,139 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారు. సంక్షేమ పథకాలను విప్లవాత్మకంగా అమలు చేసి, ఇంత మొత్తం ఖర్చు చేసిన పరిస్థితిని బహుశా ఎప్పుడూ చూడలేదేమోనని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేధోమథన సదస్సు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిరోజు ‘పరిపాలన– సంక్షేమం’ అంశంపై నిపుణులు, లబ్ధిదార్లు, అధికారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పార్టీ మేనిఫెస్టోను తాను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా భావిస్తానని ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నానని తెలిపారు. ప్రతి అధికారి, ప్రతి మంత్రి దగ్గర.. ఆఖరికి తన చాంబర్‌లో కూడా గోడలకు మేనిఫెస్టోనే కనిపిస్తుందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని దాదాపు 90 శాతం హామీలను మొదటి సంవత్సరమే పూర్తి చేశామని తెలిపారు. ఇంకా వడివడిగా అడుగులేస్తే దాదాపు 98– 99 శాతానికి చేరుకుంటామని పేర్కొన్నారు. ‘పరిపాలన– సంక్షేమం’కు పిల్లర్లు గ్రామ వలంటీర్లు, సచివాలయాలు అని సీఎం జగన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలోకి ఎన్నడూ అవినీతి రావొద్దని సీఎం జగన్ పిలుపునిచ్చారు. దీన్ని మరింత బలోపేతం చేయడం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, లబ్ధిదారులు, నిపుణులతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. గ్రామ, వార్డు వలంటీర్లకు లెర్నింగ్‌ కోసం ఈ సందర్భంగా సీఎం జగన్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా వివక్ష లేకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్న ఆలోచనలతో పుట్టుకొచ్చిందే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే, వారికి కూడా పథకాలు అందించాలని సూచించారు. మీ మాటలను ఒక స్ఫూర్తిగా తీసుకుంటానని, ఇంకా బాగా పని చేయడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అలాగే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సహాయం చేస్తుంటే, లబ్దిదారులు పొందే ఆనందం, వారి దీవెనలు ఒక కిక్‌లా పని చేస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. అవి ఉన్నంత వరకు ఈ వ్యవస్థలో అవినీతికి చోటు ఉండదని తన నమ్మకమన్నారు. గ్రామ సచివాలయాలు మొదలు, వ్యవస్థలో మార్పు వరకు ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్‌ రివ్యూ మొదలు పెట్టామని.. ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ ఉంటుందని ఆయన ప్రకటించారు.








Untitled Document
Advertisements