ఏపీలో తగ్గిన కరోనా కేసులు!!!

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 11:19 AM

ఏపీలో తగ్గిన కరోనా కేసులు!!!

ఏపీని కరోనా టెన్షన్ వెంటాడుతూనే ఉంది. గత రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినా.. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,148 శాంపిల్స్‌ను పరీక్షించగా 48 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2,719కు చేరాయి. మరో 55 మంది వైరస్ నుంచి నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 759కు చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1903మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 57మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఒకరు కన్నుమూశారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో 4 కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చారని బులిటెన్‌లో తెలిపారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 153 ఉన్నాయని ప్రకటించారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 111మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు. ఇవన్నీ కలిపితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 2983కు చేరినట్లు లెక్క. అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో కొత్త టెన్షన్ వెంటాడుతోంది.






Untitled Document
Advertisements