మరో అద్భుత ఘట్టం: తెలంగాణలో కొండపోచమ్మ సాగర్‌ను ప్రారంభించనున్న కేసీఆర్!

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 02:07 PM

మరో అద్భుత ఘట్టం: తెలంగాణలో కొండపోచమ్మ సాగర్‌ను ప్రారంభించనున్న కేసీఆర్!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మే 29న ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మర్కూక్ పంప్ హౌస్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని ఎత్తిపోస్తారు. ఈ సందర్భంగా కొండ పోచమ్మ ఆలయంలో త్రిదండి చిన్నజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ హోమం నిర్వహిస్తారని హరీష్‌ తెలిపారు. ఏడు దశల్లో నీటిని ఎత్తిపోయడం ద్వారా కాళేశ్వరం జలాలు రంగనాయక సాగర్ వరకు వచ్చాయి. ఇక్కడి నుంచి ఎక్కడా నిల్వ చేయకుండా.. ఒకేసారి మూడు అంచెలుగా ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలిస్తారు. రంగనాయక సాగర్ నుంచి 16 కి.మీ. సొరంగం నిర్మించి.. కొమరవెల్లి మల్లన్న సర్జ్‌పూల్‌లోకి జలాలను తరలిస్తారు. అక్కడి నుంచి అక్కారం సర్జ్‌పూల్‌లోకి.. తర్వాత మర్కూక్ సర్జ్‌పూల్‌లోకి నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి చేరతాయి. తద్వారా గోదావరి జలాలను సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తుకు తరలించినట్లు అవుతుంది. కొండపోచమ్మ సాగర్ ద్వారా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో కాళేశ్వరం జలాలు పారనున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం విషయమై సీఎం కేసీఆర్ మర్కూక్ సర్పంచ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.






Untitled Document
Advertisements