మురళీధరన్ అందరినీ విసిగెంచేవాడు: రసెల్

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 12:49 PM

మురళీధరన్ అందరినీ విసిగెంచేవాడు: రసెల్

శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్‌కి నోటి దురుసు ఎక్కువని ఒకప్పటి అతని సహచరుడు రసెల్ ఆర్నాల్డ్ ఆరోపించాడు. మ్యాచ్ సమయంలో అతనిచ్చే సలహాలకి టీమ్‌లోని వారిందరికీ విసుగొచ్చేదని చెప్పుకొచ్చిన ఆర్నాల్డ్.. అందరూ అతడ్ని ‘మోటార్ మౌత్’ అని పిలిచేవాళ్లమని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 1300 వికెట్లు పడగొట్టిన మురళీధరన్.. సహచరుల మంచి కోరి కొన్ని సలహాలు, సూచనలు చేసినా అవి తమకి ఒక్కోసారి కోపం తెప్పించేవని ఆర్నాల్డ్ వివరించాడు. శ్రీలంక తరఫున 1997 నుంచి 2007 వరకూ ఆర్నాల్డ్ మ్యాచ్‌లు ఆడాడు.
శ్రీలంక తరఫున తాను క్రికెట్ ఆడే రోజుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రసెల్ ఆర్నాల్డ్ మాట్లాడుతూ ‘‘అప్పట్లో టీమ్‌లోని కొంత మందితో లవ్- హేట్ రిలేషన్‌షిప్ ఉండేది. కానీ.. ఒక్క ముత్తయ్ మురళీధరన్‌తో తీరుతో మాత్రం చాలా ఇబ్బందిపడ్డాను. ఒక్కోసారి అతను చెప్పే మాటలు చాలా బాధించేవి. బ్యాట్స్‌మెన్ ఔటై పెవిలియన్‌కి వచ్చినప్పుడు.. అతని పక్కకి వెళ్లి అతను ఆడిన షాట్ తప్పిదాన్ని ఎత్తిచూపేవాడు. అలానే బ్యాటింగ్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆటగాడి పక్కకి వెళ్లి.. గత మ్యాచ్‌లో నువ్వు ఆడిన షాట్ మళ్లీ ఆడకు అని హెచ్చరించేవాడు. ఈ క్రమంలో అతను కొన్ని విలువైన సలహాలు, సూచనలు చేసేవాడు. కానీ.. అస్తమానం ఎవరో ఒకరిని అయితే విసిగించేవాడు. దాంతో.. అందరం అతడ్ని మోటార్ మౌత్ అని పిలిచేవాళ్లం’’ అని వెల్లడించాడు.

రసెల్ ఆర్నాల్డ్ శ్రీలంక తరఫున 44 టెస్టులు, 180 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడగా.. ముత్తయ్ మురళీధరన్ మాత్రం ఏకంగా 133 టెస్టులు, 350 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.





Untitled Document
Advertisements