కరోనా కట్టడికి మూసుకుపోతున్న దారులు...అగ్ర రాజ్యం ఆందోళన

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 02:16 PM

కరోనా కట్టడికి మూసుకుపోతున్న దారులు...అగ్ర రాజ్యం ఆందోళన

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు అక్కడే నమోదవుతున్నాయి. ఇటీవల వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రెటరీ అలెక్స్ అజర్ చేసిన వ్యాఖ్యలతో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే దారులు రోజురోజుకీ మూసుకుపోతున్నాయని అజర్ వ్యాఖ్యానించారు.
‘‘ రెండు నెలల కిందటితో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ప్రస్తుతం పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది.. ఈ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు ఏమైనా చర్యలు తీసుకుందామంటే.. అందుకు గల దారులన్నీ మూసుకుపోతున్నాయి’’ అని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు గతం కంటే మరింత సమర్థంగా సన్నద్ధమైనట్లు అజర్‌ వివరించారు. కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల సంఖ్య, ఆసుపత్రుల సామర్థ్యం, పీపీఈ కిట్లను భారీగా పెంచుకున్నట్లు తెలిపారు. అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభించడానికి గల కారణాలను ఈ సందర్భంగా అజర్‌ విశ్లేషించారు. 35 ఏళ్లలోపువారే ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారని, వీరిలో చాలా మందికి ఎలాంటి కరోనా లక్షణాలు బయటపడలేదని అన్నారు. ఇలాంటి వారే వైరస్‌ వాహకులుగా మారారని..అందుకే మహమ్మారి భారీ స్థాయిలో వ్యాప్తి ఉందన్నారు.

లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం వల్లే కేసులు పెరుగుతున్నాయనే వాదనను ఆయన కొట్టిపారేశారు. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు సక్రమంగా పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా హాట్‌స్పాట్‌లలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించాలని, లేకపోతే వైరస్‌ విస్తరిస్తూనే ఉంటుందని హెచ్చరించారు.



అమెరికాలో ప్రస్తుతం రోజుకు 40వేల వరకూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న న్యూయార్క్‌‌లో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తోంది. అరిజోనా రాష్ట్రంలో ఆదివారం కొత్త కేసుల సంఖ్య 267 శాతం పెరిగింది. న్యూయార్క్‌లో శనివారం కేవలం ఐదుగురు మాత్రమే మృతిచెందారు. ఏప్రిల్‌ నెలలో సగటున ఇక్కడ రోజుకు 800 మరణాలు సంభవించిన విషయం తెలిసిందే.

అమెరికాలో ఇప్పటి వరకూ 26,37,077 మంది వైరస్ బారినపడగా.. వీరిలో దాదాపు 11 లక్షల మంది కోలుకున్నారు. మరో 14 లక్షల మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 128,437 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్, ఫ్లోరిడాలో ఆంక్షలు సడలింపులతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.





Untitled Document
Advertisements