తెలంగాణలో ఒక్కరోజే 983 కేసులు...

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 02:17 PM

తెలంగాణలో ఒక్కరోజే 983 కేసులు...

తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 983 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,419కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 9000గా ఉన్నాయి. గత 24 గంటల్లో 244 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,172కు చేరింది. ఇక ఆదివారం మరో నలుగురు వ్యక్తులు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 247కి చేరింది.
ఆదివారం రోజు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 816 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 47 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో 33 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో మేడ్చల్ జిల్లా ఉంది. ఇక్కడ 29 కేసులు నమోదయ్యాయి.

ఇక వరంగల్ రూరల్‌లో 19, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, భద్రాద్రిలో 5, నల్గొండ, కరీంనగర్, సిద్దిపేట్‌, ఖమ్మంలో 3, ఆదిలాబాద్‌, గద్వాలలో 2, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, జనగామ, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోకేసు గుర్తించారు.

మరోవైపు, తెలంగాణలో ఆదివారం 3227 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 983 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా టెస్టుల సంఖ్య 82,458కు చేరింది. ఆదివారం 2244 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.





Untitled Document
Advertisements